స్వరాష్ట్ర సాధనే ధ్యేయంగా రెండు దశాబ్దాల క్రితం ఏర్పాటైన టీఆర్ఎస్ ఆవిర్భావ
దినోత్సవాన్ని గ్రేటర్ వ్యాప్తంగా మంగళవారం నిరాడంబరంగా జరుపుకున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ పలు చోట్ల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పార్టీ జెండాను ఆవిష్కరించారు. స్వీట్లు పంచుకొని సంబురాలు జరుపుకున్నారు. అనంతరం తెలంగాణ ఉద్యమ సాధనలో టీఆర్ఎస్ పాత్రను గుర్తు చేసుకున్నారు.
తెలంగాణ ప్రజల భాగస్వామ్యం.. ఉద్యమ నేత కేసీఆర్ నిర్విరామ పోరాటం ఫలితంగా తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నామని మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావాన్ని పురస్కరించుకొని ఆమె తన క్యాంపు కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రొఫెసర్ జయశంకర్ సర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర సాధనే ధ్యేయంగా అనాటి ఉద్యమ నేత కేసీఆర్ 2001 ఏప్రిల్ 27న టీఆర్ఎస్ను స్థాపించారన్నారు. అనేక ఉద్యమాలు చేసి తెలంగాణను సాధించారని అన్నారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో పని చేయడం గర్వంగా ఉందన్నారు.
సాధించుకున్న రాష్ర్టాన్ని బంగారుమయంగా మారుస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేనని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. మల్కాజిగిరి నియోజకవర్గంలోని పలు డివిజన్లలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మల్కాజిగిరి చౌరస్తాలో జెండాను ఆవిష్కరించగా ఎమ్మెల్యే మైనంపల్లి పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటే ధ్యేయంగా ఉద్యమ నేత కేసీఆర్ పోరు చేశారన్నారు. స్వరాష్ట్రంలో ఆదర్శ పాలన సాగిస్తున్నారని అన్నారు.
స్వరాష్ట్ర సాధన కోసం ఎత్తిన జెండాను దించకుండా పోరు సల్పిన ఉద్యమ నేత కేసీఆర్ అని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. హబ్సిగూడలోని తన నివాసంలో టీఆర్ఎస్ అభిమానులు, కార్యకర్తలు, నేతలు, ప్రజాప్రతినిధులతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ సాధించుకున్న రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు టీఆర్ఎస్ ఎప్పుడూ ముందుంటుందన్నారు.
సమైక్య పాలకుల నుంచి తెలంగాణకు విముక్తి కల్పించిన ఉద్యమ నేత కేసీఆర్.. స్వరాష్ట్రంలో ప్రతిఒక్కరూ ఆత్మగౌరవంగా బతికేలా పాలన సాగిస్తున్నారని ఎమ్మెల్సీ కుర్మయ్యగారి నవీన్కుమార్ అన్నారు. కూకట్పల్లి నియోజకవర్గంలోని బాలాజీ నగర్లో నిర్వహించిన ఆవిర్భావ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. టీఆర్ఎస్ అంటేనే తెలంగాణ.. తెలంగాణ అంటేనే టీఆర్ఎస్లా ప్రజలు ఆదరిస్తారని అన్నారు.
అప్పటి ఉద్యమ నాయకుడు, ప్రస్తుత సీఎం కేసీఆర్ పోరు ఫలితం.. ఎందరో అమరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానందనగర్ డివిజన్లోని వెంకటేశ్వరనగర్లో పార్టీ పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ గులాబీ జెండాపై ప్రజలకు అంచెంచల విశ్వాసం ఉందన్నారు.
బంగారు తెలంగాణ నిర్మాణానికి సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని ఎల్బీనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. ఎల్బీనగర్ డివిజన్ వ్యాప్తంగా టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. హస్తినాపురం డివిజన్లో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే సుధీర్రెడ్డి పాల్గొని టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు. ఎల్బీనగర్ నియోజకవర్గం టీఆర్ఎస్కు అడ్డాగా మారిందన్నారు.
ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన పార్టీ టీఆర్ఎస్ అని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. టీఆర్ఎస్ ఆవిర్భవాన్ని పురస్కరించుకొని మైలార్దేవ్పల్లి డివిజన్ ఉడంగడ్డలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కార్యకర్తలతో కలిసి సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎందరో త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ సుభిక్ష పాలన చేస్తున్నారని అన్నారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చింతల్ క్యాంపు కార్యాలయంలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, టీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు దుండిగల్ మున్సిపాలిటీలోని తన క్యాంపు కార్యాలయంలో జెండాను ఆవిష్కరించారు. పార్టీ శ్రేణులతో కలిసి సంబురాలు జరుపుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా 20 సంవత్సరాల క్రితం టీఆర్ఎస్ ఆవిర్భవించిందని డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్రెడ్డి అన్నారు. తార్నాక చౌరస్తాలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జెండాను ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ అనాటి ఉద్యమ నేత కేసీఆర్ శాంతియుత పోరాటంతోనే స్వరాష్ట్రం సాధించుకోగలిగామన్నారు.