న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ చౌకబారు భాషను వాడుతున్నారని బీజేపీ నేతలు మండిపడ్డారు. రాహుల్ తన వ్యాఖ్యలతో రాజకీయాలను దిగజారుస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాజస్ధాన్లో ర్యాలీ సందర్భంగా ప్రధాని మోదీ పట్ల చేసిన వ్యాఖ్యలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ తీవ్రంగా ఖండించారు. ప్రధాని మోదీ హాజరవడం వల్లే అహ్మదాబాద్లో జరిగిన భారత్, ఆస్ట్రేలియా వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్లో భారత్ ఓటమి పాలైందని రాహుల్ చేసిన వ్యాఖ్యలను ఆక్షేపించారు.
కాంగ్రెస్ పార్టీ తరపున రాహుల్ వ్యాఖ్యలపై ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే క్షమాపణ చెప్పాలని జోషీ డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ రాజకీయ మర్యాదలను మంటగలుపుతూ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు.
ఎన్నికల నియమావళి అమల్లో ఉండగా ప్రధాని వంటి అత్యున్నత పదవుల్లో ఉన్నవారి పట్ల కొంత సభ్యత పాటించాల్సిన అవసరం ఉంటుందని, సాధారణ సభ్యతను కూడా రాహుల్ మరిచిపోయారని ఎద్దేవా చేశారు. అత్యున్నత పదవులు అలంకరించిన కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ ప్రధానిని ఉద్దేశించి అలాంటి వ్యాఖ్యలు చేయవచ్చా అని ప్రశ్నించారు.
Read More :