న్యూఢిల్లీ : జులైలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఈ ఏడాది వర్షాకాల సమావేశాల నిర్వహణకు విధివిధానాలపై కసరత్తు సాగుతోందని జులై నుంచి ప్రారంభమయ్యే ఈ సమావేశాలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని ఆశిస్తున్నానని పార్లమెంటటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ మంగళవారం పేర్కొన్నారు.
కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో వర్షాకాల సమావేశాలు యధావిధిగా జరిపేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. పలువురు ఎంపీలు, ఉభయ సభల సిబ్బందిలో చాలావరకూ కరోనా వైరస్ వ్యాక్సిన్ కనీసం సింగిల్ డోసు తీసుకోవడంతో సమావేశాల నిర్వహణపై అధికారులు విశ్వాసంతో ఉన్నారు. కరోనా మహమ్మారి దేశాన్ని తాకినప్పటి నుంచి పార్లమెంట్ మూడు సెషన్లు నిలిచిపోగా, గత ఏడాది జులైలో జరగాల్సిన వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ కు వాయిదా పడ్డాయి.