Prakash Ambedkar | ముంబై : మహారాష్ట్ర ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాడి(ఎంవీఏ)పై వంచిత్ బహుజన్ అఘాడి(వీబీఏ) అధ్యక్షుడు ప్రకాశ్ అంబేద్కర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కూటమిలో భాగమైన శరద్ పవార్, ఉద్ధవ్ థాక్రే తనను నిర్లక్ష్యం చేస్తున్నారని, తమ పార్టీ ప్రయోజనాలను పట్టించుకోవడం లేదని ప్రకాశ్ ధ్వజమెత్తారు. ఈ క్రమంలో కూటమిలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మాత్రమే మద్దతు ఇస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
ఎంవీఏ కూటమిలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి ఏడు లోక్సభ స్థానాలు కేటాయించారు. ఈ ఏడు స్థానాల్లో వీబీఏ కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతును ఇస్తుందని, కాంగ్రెస్ గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం నిర్వహించనున్నట్లు ప్రకాశ్ అంబేద్కర్ తెలిపారు. అయితే ఆ ఏడు నియోజకవర్గాల పేర్లను వెల్లడించాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేను ప్రకాశ్ అంబేద్కర్ కోరారు. ఈ మేరకు ఖర్గేకు ప్రకాశ్ లేఖ రాశారు. మార్చి 17వ తేదీన ముంబైలో నిర్వహించిన భారత్ జోడో న్యాయ యాత్రకు పలు కారణాల వల్ల హాజరు కాలేకపోయానని లేఖలో పేర్కొన్నారు ప్రకాశ్ అంబేద్కర్. అప్రజాస్వామిక బీజేపీ – ఆర్ఎస్ఎస్ గవర్నమెంట్ను గద్దె దింపడమే తమ పార్టీ లక్ష్యమని, అందులో భాగంగా కాంగ్రెస్కు మద్దతు ప్రకటిస్తున్నట్లు ప్రకాశ్ చెప్పారు.