Adani | దేశంలో విద్యుత్తు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో బొగ్గు కొరత రాకుండా జాగ్రత్తపడాలని విద్యుదుత్పత్తి కంపెనీలకు కేంద్రం సూచించింది. థర్మల్ విద్యుత్తు సంస్థలన్నీ తాము వాడే బొగ్గులో కనీసం 4 శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకొన్న బొగ్గును కలుపాలని ఆదేశించింది. సంక్షోభ సమయంలో మోదీ సర్కార్ అత్యుత్సాహం వెనుక ఆంతర్యమేమిటి?
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): దేశంలోని థర్మల్ విద్యుత్తు సంస్థలన్నీ తాము వాడే బొగ్గులో కనీసం 4 శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దేశంలో విద్యుత్తు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో.. వచ్చే ఏడాది మార్చి వరకు ఈ నిబంధనలు పాటించాల్సిందేనని పేర్కొన్నది. ఈ మేరకు గత శనివారం ఆదేశాలు జారీచేసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, కేంద్రం నిర్ణయాన్ని యూపీ సహా పలురాష్ర్టాల్లోని విద్యుదుత్పత్తి ప్లాంట్ అధికారులు వ్యతిరేకిస్తున్నారు. దేశీయంగా లభించే బొగ్గుతో పోలిస్తే, విదేశీ బొగ్గు ఖరీదైనదని, అంత మొత్తంలో చెల్లించి కొనుగోలు చేసిన బొగ్గుతో విద్యుదుత్పత్తి చేస్తే.. కరెంట్ చార్జీలు పెంచా ల్సి వస్తుందని అంటున్నారు. ఇది అంతిమం గా వినియోగదారులపై భారమేనని చెబుతున్నారు. అయినా కేంద్రం దిగుమతులపై వెన క్కి తగ్గడంలేదని ఓ అధికారి వాపోయారు.
అంతర్జాతీయ విపణిలో మొన్నటివరకూ తగ్గుముఖం పట్టిన బొగ్గు ధరలు, గత మూడు మాసాల్లోనే 22 శాతం మేర పెరిగినట్టు పారిశ్రామికవర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు కేంద్రం కచ్చితంగా 4 శాతం ఇంపోర్టెడ్ బొగ్గును వాడాలన్న నిబంధన పెట్టడంతో విద్యుత్తు ఉత్పత్తి సంస్థలు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. విదేశీ బొగ్గు ధరలు ఆకాశాన్నంటిన వేళ విదేశీ బొగ్గును దిగుమతి చేసుకోవాలని కేంద్రం ఆదేశించటంపై నిపుణులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. అదానీ గ్రూప్ కంపెనీలకు లబ్ధి చేకూర్చేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకొన్నదని విమర్శిస్తున్నారు. 2023-24 తొలి త్రైమాసికంలో దేశీయంగా బొగ్గు ఉత్పత్తి 8.6 శాతం మేర పెరిగి 22.33 కోట్ల మెట్రిక్ టన్నులకు చేరింది. ఇది ఆల్ టైమ్ గరిష్ఠం. ఇప్పుడు బొగ్గు దిగుమతులే అవసరం లేదు. అయినా కేంద్రం విదేశీ బొగ్గు షరతు పెట్టడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ విద్యుత్తు ఉత్పత్తి సంస్థ ఎన్టీపీసీకి రెండేండ్లపాటు బొగ్గు సరఫరా చేసే కాంట్రాక్టు అదానీ గ్రూప్నకే దక్కింది. 2021 అక్టోబర్లో 10 లక్షల టన్నుల విదేశీ బొగ్గు కోసం ఎన్టీపీసీ టెండర్లు ఆహ్వానించింది. నిరుడు జనవరిలో ఆ టెండర్ను అదానీ గ్రూప్ గెలుచుకొన్నదని పేరు చెప్పటానికి ఇష్టపడని ఎన్టీపీసీ అధికారి ఒకరు తెలిపారు. కోల్కతా కేంద్రంగా పనిచేస్తున్న దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ లిమిటెడ్ కూడా అదానీ గ్రూప్నకే 10 లక్షల టన్నుల బొగ్గు సరఫరాకు ఆర్డర్ ఇచ్చినట్టు తెలిసింది.
దేశ చరిత్రలో ఇప్పటివరకు బొగ్గు సరఫరా మొత్తం భారతీయ రైల్వేల ఆధ్వర్యంలోనే నడుస్తూ వస్తున్నది. కానీ, కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్యాసింజర్ రైళ్లతోపాటు గ్రూడ్స్ రైళ్లను కూడా ప్రైవేటుకు అప్పగిస్తున్నారు. ఛత్తీస్గఢ్ నుంచి బొగ్గును గోవాలోని మార్మగోవా పోర్టుకు సరఫరా చేసే రైల్వే లైన్ను అదానీ కుటుంబానికి అప్పగించినట్టు ఆర్టీఐ కింద నిహర్ గోఖలే అనే జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ బదులిచ్చింది. మార్మగోవా పోర్టు కూడా అదానీ గ్రూప్ చేతిలోనే ఉండటం గమనార్హం.
అదానీ గ్రూప్నకు కాసులు కురిపించడానికే కేంద్రప్రభుత్వం దిగుమతుల నిబంధనలు తీసుకొచ్చినట్టు పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దేశంలోని కీలకమైన బొగ్గు గనులే కాదు.. ఆస్ట్రేలియాలోని క్వీన్స్ల్యాండ్, ఇండోనేషియా తదితర దేశాల్లోనూ అదానీ గ్రూప్నకు పెద్ద ఎత్తున బొగ్గు గనులున్నాయి. విదేశాల నుంచి భారత్కు అత్యధికంగా బొగ్గు ఎగుమతి చేస్తున్న కంపెనీ కూడా అదానీ గ్రూపుదే. అంతేకాదు.. దేశంలో అత్యధికంగా థర్మల్ విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్న కంపెనీ కూడా అదానీదే. థర్మల్ విద్యుత్తు సంస్థలన్నీ తాము వాడే బొగ్గులో కనీసం 4 శాతం విదేశీ బొగ్గు కలుపాలని కేంద్రం ఆదేశించటం అదానీ గ్రూప్నకు సిరులు కురిపించనున్నదని చెబుతున్నారు.