(స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ)
మధ్యప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ‘స్మార్ట్ క్లాస్’ పథకం అటకెక్కింది. పలు జిల్లాల్లో విద్యుత్తు కోతలతో పాఠశాలల్లో అమలు చేస్తున్న ఈ పథకం నిరర్థకంగా మారింది. సాంకేతిక అభివృద్ధిని అందిపుచ్చుకుని ఇంటర్నెట్ ద్వారా విద్యార్థులకు బోధన అందించేందుకు తీసుకొచ్చిన ఈ పథకం ఫలం విద్యార్థులకు అందని ద్రాక్షగా మారింది. గత ఏడాది బీజేపీ ప్రభుత్వం 9,200 పాఠశాలల్లో రూ.6,952 కోట్లతో స్మార్ట్ క్లాస్ పథకం ప్రారంభించాలని నిర్ణయించింది. మొదటి విడతలో జిల్లా, తాలూకా కేంద్రాల్లోని 350 బడుల్లో మొదలు పెట్టింది. విద్యుత్తు సరఫరా, కంప్యూటర్లు, ఇంటర్నెట్ లాంటి కనీస సౌకర్యాలు కల్పించాల్సి ఉన్నా.. ఆచరణలో సరిగా అమలు కాకపోవడంతో ఈ పథకం నీరుగారిపోయింది.
ఛింద్వాడా, మోహఖేడ్ , ధర్, ఖర్గనే, మాండియా, సిధి, సింగ్రౌలి తదితర జిల్లాల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, సెకండరీ పాఠశాలల్లో విద్యుత్తు అంతరాయం నెలకొన్నది. 50 శాతం పాఠశాలల్లో స్మార్ట్ క్లాస్ పథకం మూలన పడటంతో టీవీలు నిరుపయోగంగా మారాయి. కొన్ని పాఠశాలల్లో ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడం వల్ల ఉపాధ్యాయులు సెల్ఫోన్లతో మొబైల్ హాట్ స్పాట్ ద్వారా పాఠాలు చెప్పాలని ప్రయత్నిస్తున్నా.. విద్యుత్తు కోతల వల్ల విద్యార్థుల విలువైన సమయం వృథాగా మారింది. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కొరత, ప్రభుత్వ తీరుపై సంబంధిత జిల్లా అధికారులు అంతర్గతంగా ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు తమ నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారు. కాగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేస్తూ, ప్రత్యేకంగా టీ-శాట్ ద్వారా విద్యార్థులకు, నిరుద్యోగులకు నిరంతర పాఠాలు అందిస్తున్న విషయం తెలిసిందే.