(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): కన్నడ ప్రజల పరిస్థితి ప్రస్తుతం పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా తయారైంది. బీజేపీ ‘40 శాతం కమీషన్ రాజ్’ పాలనతో విసిగివేసారిన ప్రజలు అధికారాన్ని కాంగ్రెస్కు అప్పగిస్తే, విద్యుత్తు కోతలతో కేవలం ఐదు నెలల్లోనే రాష్ట్రమంతటా అంధకారం అలుముకొన్నది. బెంగళూరులో రోజుకు నాలుగైదు గంటలపాటు విద్యుత్తు కోతలు విధిస్తున్నారు.
రాష్ట్రంలో వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. దీంతో ప్రభుత్వ వైఖరిపై కర్షకలోకం మండిపడుతున్నది. సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతుండటంతో స్పందించిన విద్యుత్తు మంత్రి కేజే జార్జ్.. ‘వ్యవసాయానికి నిరంతరాయంగా 5 గంటల పాటు కరెంటు ఇస్తాం’ అంటూ ఇటీవల ఆర్భాటంగా ప్రకటించారు. అయితే, దానికీ ప్రభుత్వం కట్టుబడి ఉండట్లేదని, సాగుకు కనీసం 3 గంటలు కూడా విద్యుత్తును సరఫరా చేయట్లేదని అన్నదాతలు వాపోతున్నారు. సర్కారు వైఖరిని నిరసిస్తూ వినూత్న రీతిలో నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సాగుకు తగినంత కరెంటు ఇవ్వాల్సిందేనని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
అందుకే మొసలితో వచ్చాం..
విజయపుర జిల్లా కోల్హారా తాలూకాలోని రోణిహల్ గ్రామ రైతులు.. హుబ్లీ ఎలక్ట్రిసిటీ సైప్లె కంపెనీ లిమిటెడ్ (హెస్కామ్) కార్యాలయానికి ఓ ట్రాక్టర్లో మొసలిని తీసుకొచ్చారు. ఐదు గంటల కరెంటు ఇస్తామని చెప్పి..ఒకట్రెండు గంటలే ఇస్తున్నదని, అది కూడా రాత్రిళ్లు సరఫరా అవుతున్నదని అన్నదాతలు మండిపడ్డారు. రాత్రి సమయాల్లో పొలాలకు వెళ్తే, అడవి జంతువులు, మొసళ్లు దాడులు చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తమ ఇబ్బందులు తెలియాలన్న ఉద్దేశంతోనే కరెంటు ఆఫీసుకు మొసలిని తీసుకొచ్చినట్టు రైతులు పేర్కొన్నారు.
పురుగులమందు తాగి..
విద్యుత్తు కోతలను నిరసిస్తూ గుల్బర్గా (కలబురగి) జిల్లాలో రైతులు నిరసన ప్రదర్శనలతో రాస్తారోకోలు నిర్వహించారు. ఎండిన పంటను, పురుగుల మందును చేతబూని గుల్బర్గా విద్యుత్తు కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. కనీసం ఐదు గంటల నిరంతరాయ కరెంటునైనా సరఫరా చేయాలని, లేదంటే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకొంటామని హెచ్చరించారు. హఠాత్తుగా ఓ రైతు పురుగుల మందు తాగగా, అప్రమత్తమైన పోలీసులు సమీప దవాఖానకు తరలించి చికిత్స అందించారు. గుల్బర్గా సహా పలు జిల్లాల్లో రైతులు నిరసనలకు దిగుతున్నారు. శుక్రవారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియా, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఆట మధ్యలో విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో మ్యాచ్కు అంతరాయం ఏర్పడింది. దీంతో అభిమానులు ఒకింత అసహనానికి గురయ్యారు.