న్యూఢిల్లీ : మహ్మద్ ప్రవక్తపై బీజేపీ ప్రతినిధి నూపుర్ శర్మ వ్యాఖ్యలపై ఆగ్రహం పెల్లుబుకుతోంది. కాషాయ పార్టీ బహిష్కృత నేత నూపుర్ శర్మను అరెస్ట్ చేయాలని కోరుతూ గుజరాత్లోని సూరత్ బ్రిడ్జిపై పోస్టర్లు వెలిశాయి. సూరత్లోని జిలానీ బ్రిడ్జిపై ఈ పోస్టర్లు దర్శనమిచ్చాయి. ఈ పోస్టర్లను ఎవరు అతికించారనేది ఇంకా వెల్లడికాలేదని పోలీసులు తెలిపారు.
పోస్టర్ల వెనుక ఎవరున్నారనేది నిగ్గుతేల్చేందుకు సీసీటీవీ ఫుటేజ్ను పోలీసులు పరిశీలిస్తున్నారు. నూపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ దేశాల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. మతపరమైన మనోభావాలను దెబ్బతీశారని నూపుర్ శర్మపై పలు కేసులు నమోదయ్యాయి.
అంతర్జాతీయంగా నూపుర్ శర్మ వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం కావడంతో దిద్దుబాటు చర్యలు చేపట్టిన బీజేపీ కేంద్ర నాయకత్వం ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. తాము అన్ని మతాలను గౌరవిస్తామని చెబుతూ నూపుర్ శర్మ వ్యాఖ్యలను ఖండించింది. తన వ్యాఖ్యలపై కలకలం రేగడంతో తన వ్యాఖ్యలను భేషరతుగా వెనక్కితీసుకుంటున్నానని నూపుర్ శర్మ పేర్కొంది.