Postal Jobs | మీరు పదో తరగతి మంచి మార్కులతో పాసైనా ఖాళీగా ఉన్నారా? మీ వంటి వారి కోసం కేంద్ర తపాలా శాఖ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ముందుకు వచ్చింది. ఇందుకోసం భారీ ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేసింది. దేశవ్యాప్తంగా వివిధ సర్కిళ్ల పరిధిలో 40,889 గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.
అంతే కాదు, పదో తరగతి అర్హతపైనే పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, బ్రాంచ్ అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఆసక్తి కల వారు ఈ నెల 27 నుంచి ఫిబ్రవరి 16వ తేదీ వరకు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల్లో తప్పులు దొర్లితే ఫిబ్రవరి 17 నుంచి 19 వరకు సవరించుకునేందుకు అవకాశం కూడా కల్పించింది.
ఈ ఉద్యోగాలకు పోటీ పడే వారు 18-40 ఏండ్ల మధ్య వయస్కులై ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జితోపాటు సైకిల్ తొక్కడం కూడా రావాలి. కాగా, మొత్తం 40, 889 గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాల్లో ఆంధ్ర ప్రదేశ్లో 2480, తెలంగాణలో 1260 ఖాళీలు ఉన్నాయని కేంద్ర తపాలాశాఖ జారీ చేసిన నోటిఫికేషన్ తెలిపింది.
పదో తరగతి పాస్ కావడంతోపాటు అందులో మ్యాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాష ఉండటం తప్పనిసరి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి దరఖాస్తు చేసుకునే వారు పదో తరగతి వరకు తెలుగు సబ్జెక్ట్ తప్పనిసరిగా చదవాలి.
బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (బీపీఎం) ఉద్యోగాలకు రూ.12 వేల నుంచి రూ.29,380, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ఏబీపీఎం) లేదా గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగానికి రూ.10 వేల నుంచి రూ.24,470 మధ్య వేతనం చెల్లిస్తుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్ ఉమెన్ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. మిగిలిన అభ్యర్థులు మాత్రం రూ.100 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.