Maharashtra : మహారాష్ట్రలో దారుణం జరిగింది. ఒక దేవాలయ మండపం పిల్లర్, పైకప్పు కూలిన ఘటనలో ఐదుగురు మరణించగా, 18 మంది గాయపడ్డారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన మహారాష్ట్ర, పర్భని జిల్లా కేంద్రంలో శనివారం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ప్రాథమిక సమచారం ప్రకారం.. పర్భని జిల్లా, మన్వట్ తాలూకాలోని యశ్వాడి దేవస్థాన సంస్థాన్కు చెందిన ఆలయానికి శనివారం ఉదయం నుంచి భారీగా భక్తులు వచ్చారు.
ఆలయ ప్రాంగణమంతా భక్తులతో నిండిపోయి రద్దీగా ఉంది. ఆలయ పరిధిలోని ఒక మండపం వద్ద ఒక పిల్లర్ నిర్మాణం జరుగుతోంది. ఈ పిల్లర్ పరిధిలో కూడా భక్తులు ఉన్నారు. అయితే, శనివారం మధ్యాహ్నం ఈ పిల్లర్ ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో ఆ మండపం పైభాగం కూడా కూలి అక్కడి భక్తులపై పడింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. 18 మంది గాయపడ్డారు. మరికొందరు ఆ శిథిలాల కింద చిక్కుకుని ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు భక్తుల్ని రక్షించే చర్యలు చేపట్టారు. క్షతగాత్రుల్ని స్తానిక ఆస్పత్రులకు తరలించారు. వీరిలో ఐదుగురి పరిస్తితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. శిథిలాల కింద గాలింపు, తొలగింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ఇంకా ఎవరైనా భక్తులు శిథిలాల కింద ఉన్నారేమోనని అధికారులు గాలిస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఘటన స్తలంలో అధికారులు అంబులెన్సులు సిద్ధం చేశారు. అధికారయంత్రాంగం సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తోంది.