లూధియానా, ఏప్రిల్ 21: ఉగ్రవాద సమస్యకు ఇంకెంత మంది బలి కావాలని గురువారం టెర్రరిస్టుల గ్రెనేడ్ దాడిలో వీర మరణం పొందిన ఓ సైనికుడి భార్య కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘దేశం కోసం నా భర్త చేసిన త్యాగానికి నేనెంతో గర్వపడుతున్నా. అయితే ఇంకా ఎంత మంది బలి కావాలని నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నా? సరిహద్దుల్లో ఇంకెంత కాలం మన సైనికుల్ని కోల్పోతూనే ఉండాలి? చర్చల ద్వారా సమస్యను పరిష్కరించలేరా? నాలా ఇంకెంత మంది వితంతువులు కావాలి?
ఎందరు తల్లులు పుత్ర శోకం అనుభవించాలి? నాకు జరిగిన నష్టం మరే మహిళకూ జరగకూడదని కోరుకుంటున్నా’ అని హవల్దార్ మణిదీప్ సింగ్ భార్య జగ్దీప్కౌర్ అన్నారు. ఆమె తన కూతుళ్లతో కలిసి పంజాబ్, లూధియానా జిల్లాలోని చన్ కోయిన్ కలాన్ గ్రామంలో నివసిస్తున్నారు. శుక్రవారం ఆమె ఓ వార్తాపత్రికతో మాట్లాడుతూ.. చనిపోవడానికి కొన్ని గంటల ముందే తన భర్త తనతో ఫోన్లో మాట్లాడారని కన్నీటి పర్యంతమయ్యారు.