Pooja pal : సమాజ్వాదీ పార్టీ (SP) నుంచి ఇటీవల బహిష్కరణకు గురైన రెబల్ ఎమ్మెల్యే (Rebel MLA) పూజా పాల్ (Pooja Pal) పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav) పై సంచలన ఆరోపణలు చేశారు. తన ప్రాణాలకు ఏమైనా హాని జరిగితే దానికి పూర్తి బాధ్యత అఖిలేశ్ యాదవ్దేనని ఆమె స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపాయి.
శుక్రవారం లక్నోలో మీడియాతో మాట్లాడిన పూజా పాల్.. ‘నన్ను హత్య చేస్తే దానికి అసలైన దోషి అఖిలేశ్ యాదవే అవుతారు. నాకు ఇప్పుడు తీవ్రంగా బెదిరింపులు వస్తున్నాయి. గతంలో పట్టపగలు నా భర్తను దారుణంగా హత్యచేశారు. ఆ సమయంలో మాకు అండగా నిలవాల్సిందిపోయి సమాజ్వాది పార్టీ నేరస్థులను కాపాడింది’ అని ఆవేదన వ్యక్తంచేశారు.
సమాజ్వాదీ పార్టీలో కులవివక్ష తీవ్రంగా ఉందని ఆమె ఆరోపించారు. ‘ఎస్పీలో వెనుకబడిన, అత్యంత వెనుకబడిన వర్గాలు, దళితులను రెండో శ్రేణి పౌరులుగా చూస్తున్నారు. వారు ఎంత పెద్ద నేరస్థులైనా సరే ముస్లింలకే మొదటి ప్రాధాన్యం ఇస్తారు. అఖిలేశ్ యాదవ్ నేరస్థులపై పోరాడి న్యాయం చేస్తారని నేను నమ్మాను. కానీ వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది’ అని విమర్శించారు.
రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ఓటు వేశానన్న కారణంతో తనను పార్టీ నుంచి బహిష్కరించడాన్ని ఆమె తప్పుబట్టారు. ‘నా భర్త హంతకులకు శిక్షపడేలా చేసిన వారికి నేను కృతజ్ఞత తెలిపితే నన్ను బహిష్కరించారు. మరి గతంలో అఖిలేశ్ యాదవ్, ఆయన భార్య బీజేపీ అభ్యర్థులకు ఓటు వేయలేదా? వారు చేస్తే తప్పులేదు, నేను చేస్తే నేరమా? ఇది బీసీలను, దళితులను మోసం చేయడమే” అని అన్నారు.
ప్రయాగ్రాజ్ ఎమ్మెల్యే అయిన పూజా పాల్.. సామాజిక మాధ్యమాల్లో ఎస్పీ కార్యకర్తలు తనను దూషిస్తూ బెదిరిస్తున్నారని అన్నారు. పార్టీ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత ఆమె ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యతో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. తాను అత్యంత వెనుకబడిన వర్గానికి చెందిన బిడ్డనని, ఎప్పటికీ నేరస్థులకు తలవంచనని, మళ్లీ పోరాడి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.