న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఎన్సీఆర్ పరిధిలో పెరుగుతున్న కాలుష్య స్థాయిని దృష్టిలో ఉంచుకొని ఈ నెల 12 రాత్రి వరకు అన్ని బొగ్గు ఆధారిత పరిశ్రమలను మూసివేయాలని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆదేశించింది. తాజా ఆదేశాలు కేవలం పీఎన్జీ ఆధారిత పరిశ్రమలు నడువనున్నాయి. ఈ క్రమంలో పారిశ్రామికవేత్తలు సోనేపట్లోని ముర్తల్ బ్లాక్లోని ఓ ప్రైవేటు హోటల్ సమావేశం నిర్వహించారు. ఎగుమతిదారులు, బ్లాంకెట్ పారిశ్రామికవేత్తలూ హాజరయ్యారు. సీపీసీబీ ఆదేశాలను వారంతా వ్యతిరేకిస్తూ.. ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
కేంద్ర కాలుష్య నియంత్రణ మండలికి వ్యతిరేకంగా పారిశ్రామికవేత్తలు ఆందోళనకు దిగాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆందోళన నిర్వహించే తేదీని మాత్రం నిర్ణయించలేదు. సమావేశానికి అధ్యక్షత వహించిన పానిపట్ ఇండస్ట్రియల్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రీతమ్ సచ్దేవ మాట్లాడుతూ.. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సూచనల కారణంగా పారిశ్రామికవేత్తలు రూ.కోట్లు నష్టపోతున్నారన్నారు. బొగ్గు ఆధారంగా నడిచే పరిశ్రమలను 12 వరకు మూసివేశారని, ఇలాంటి పరిస్థితుల్లో లక్షలాది మంది నిరుద్యోగులుగా మారుతారని ఆందోళన వ్యక్తం చేశారు.