న్యూఢిల్లీ, జూలై 17: 15వ రాష్ట్రపతి ఎన్నికలు సోమవారం జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలక్టోరల్ కాలేజీ సభ్యులైన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరంతా 4,800 మంది దాకా ఉంటారు. ఢిల్లీలోని పార్లమెంటు భవనం, రాష్ర్టాల్లోని అసెంబ్లీ భవనాల్లో ఈ ఎన్నికలు జరుగనున్నాయి. బ్యాలెట్ పత్రాల్లో ఓటు వేసి బ్యాలెట్ బాక్సుల్లో వేస్తారు. జూలై 21న ఓట్ల లెక్కింపు జరుగనున్నది. 25వ తేదీన కొత్తగా ఎన్నికైన రాష్ట్రపతి ప్రమాణస్వీకారం చేస్తారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, విపక్షాల తరఫు అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా బరిలో ఉన్న విషయం తెలిసిందే. ఎంపీలు ఆకుపచ్చ రంగు బ్యాలెట్ పత్రాల్లో, ఎమ్మెల్యేలు పింక్ రంగు బ్యాలెట్ పత్రాల్లో తమ ఓటు వేయనున్నారు.
ఓటు విలువ ఎంత?
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎమ్మెల్యేలు, ఎంపీల ఓటు విలువ వేర్వేరుగా ఉంటుంది. 1971 జనాభా లెక్కల ప్రకారం రాష్ర్టాల జనాభాను బట్టి ఎమ్మెల్యేల ఓటు విలువ నిర్ధారిస్తారు. ఎంపీలందరి ఓటు విలువ ఒకేలా (700) ఉంటుంది. ప్రస్తుతం ఎమ్మెల్యేలు, ఎంపీల మొత్తం ఓట్ల విలువ 10,86,431గా ఉన్నది.
ఎవరివైపు ఎవరు?
బీజేడీ, వైసీపీ, బీఎస్పీ, అన్నా డీఎంకే, టీడీపీ, జేడీ(ఎస్), శిరోమణి అకాలీదళ్, శివసేన, జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీలు ఎన్డీయే అభ్యర్థికి మద్దతుగా ఉంటామని ప్రకటించాయి. ఇక విపక్షాల తరఫు అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు కాంగ్రెస్తో పాటు టీఆర్ఎస్, ఎన్సీపీ, టీఎంసీ, ఆప్, డీఎంకే, ఎస్పీ, నేషనల్ కాన్ఫరెన్స్, సీపీఐ, సీపీఐ(ఎం), ఎంఐఎం, ఆర్జేడీ, ఆలిండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ తదితర 17 పార్టీలు మద్దతు ప్రకటించాయి. కాగా, సొంత రాష్ట్రంలో కాకుండా వేరే ప్రదేశాల్లో 51 మంది ప్రజాప్రతినిధులు ఓటు వేయనున్నారు. పలు రాష్ర్టాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు పార్లమెంటులో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
సిద్ధాంతాల మధ్య పోటీ
‘రాష్ట్రపతి ఎన్నికలు ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగట్లేదు. సిద్ధాంతాల మధ్య జరుగుతున్న పోరిది. నేను దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తాను. ద్రౌపది ముర్ము ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న పార్టీ తరఫున పోటీలో ఉన్నారు’ అని యశ్వంత్ సిన్హా వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో ఏర్పాట్లు పూర్తి
రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే పోలింగ్ కోసం శాసనసభ అసెంబ్లీ కమిటీ హాల్లో పోలింగ్ బూత్ను ఏర్పాటు చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఎన్నికల నిర్వహణ కోసం పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎన్నికలు సజావుగా, శాంతియుతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ఉపేందర్రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి వి. నర్సింహాచార్యులు పర్యవేక్షిస్తున్నారు. కాగా, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్, ఎన్నికల పరిశీలకులు కృష్ణకుమార్ ద్వివేది శని, ఆదివారాలు రెండు రోజులు పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు. ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులను మాత్రమే అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతి ఇవ్వనున్నారు. అసెంబ్లీ ప్రాంగణమంతా సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వ చీఫ్విప్, ప్రభుత్వ విప్లు సహ ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
అసెంబ్లీలో ఎమ్మెల్యేలు… పార్లమెంట్లో ఎంపీలు
రాష్ట్రపతి ఎన్నికల్లో రాష్ట్రంలోని 24 మంది ఎంపీలు తమ ఓటు హక్కును పార్లమెంట్లో పోలింగ్ బూత్లో వినియోగించుకోనున్నారు. రాష్ట్రంలోని 119 మంది ఎమ్మెల్యేలతోపాటు ఏపీ నుంచి ఒక ఎమ్మెల్యే మొత్తం 120 మంది ఎమ్మెల్యేలు ఓటు వేస్తారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎక్కడి నుంచైనా తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది.
ఓటు విలువ ఇలా
రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటువేసే పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేల ఓటు విలువ ప్రకారం రాష్ట్ర ఓట్ల బలం 32,508. రాష్ట్రంలోని 24 ఎంపీలు, 119 మంది ఎమ్మెల్యేలు రాష్ట్రపతి ఎన్నికల్లో సోమవారం ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రాష్ట్ర జనాభాను అసెంబ్లీ సభ్యుల సంఖ్యతో భాగిస్తే వచ్చే విలువను ఒక్కో సభ్యుడి ఓటు విలువగా పరిగణిస్తారు. ఈ లెక్కన రాష్ట్రంలోని అసెంబ్లీలో ఉన్న 119 మంది ఎమ్మెల్యేల ఒక్కో ఓటు హక్కు 132గా ఎన్నికల సంఘం నిర్ధారించింది.