పంజాబ్లో పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకూ 17.77 శాతం పోలింగ్ నమోదైంది. 117 నియోజకవర్గాల్లో 1,304 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ కొనసాగుతుంది. పలువురు నేతలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్, ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్, పీసీసీ చీఫ్ సిద్దూ, కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ, శిరోమణి అకాలీదళ్ నేతలైన ప్రకాశ్ సింగ్ బాదల్, సుఖ్బీర్ సింగ్ బాదల్, హర్ సిమ్రత్ కౌర్ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఇక.. తిరిగి తామే అధికారంలోకి వస్తామని సీఎం చెన్నీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మంచి ప్రభుత్వం, పారదర్శక ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు. ఇక… పీసీసీ అధ్యక్షుడు సిద్దూ మాట్లాడుతూ… పంజాబ్ను ప్రేమించే వారికి, మాఫియాకు మధ్య జరుగుతున్న ఎన్నికలుగా అభివర్ణించారు. ఓటును అత్యంత జాగ్రత్తగా వినియోగించుకోవాలని, మార్పు తీసుకురావడానికి ప్రయత్నించాలని సిద్దూ పిలుపునిచ్చారు.
సుఖ్బీర్ సింగ్ బాదల్ (అకాలీదళ్)
బీఎస్పీ, అకాలీదళ్ కూటమి అధికారంలోకి వస్తుంది. 80కి పైగా సీట్లను గెలుచుకుంటాం. మావైపు ప్రజలున్నారని, ఓ అసాధారణ తీర్పును చూడబోతున్నారు.
ప్రకాశ్ సింగ్ బాదల్ (అకాలీదళ్ అగ్రనేత)
గత మూడు తరాలుగా మేం పంజాబ్ కోసమే ఉన్నాం. మిగతా వారు పార్టీలన్నీ తిరిగారు. టిక్కెట్లు తెచ్చుకున్నారు. అందులో అమరీందర్ సింగ్ ఒకరు
కెప్టెన్ అమరీందర్ సింగ్ (మాజీ సీఎం)
పాటియాలా నుంచి గెలుస్తున్నాను. మేం ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తాం. కాంగ్రెస్ వేరే లోకంలో ఉంది. కాంగ్రెస్ను ప్రజలు ఓడించి తీరుతారు.