Prashant Kishor | బిహార్ అసెంబ్లీలో తన సత్తా చూపేందుకు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. గత కొన్నాళ్లుగా బిహార్ రాజకీయాల్లో ఆయన బిజీగా ఉన్నారు. జన్ సురాజ్ అభియాన్ పేరుతో ప్రజలను కలుసుకునే కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఇదే సమయంలో తన మిత్రుడు బిహార్ సీఎం నితీష్ కుమార్పై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. బిహార్లో నితీష్కు తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్న ప్రశాంత్ కిషోర్.. ఎన్నికల్లో పోటీ చేయడంపై తన మనసులోని మాటను వెల్లగక్కాడు.
ఎన్నికల రంగంలోకి దిగాలని ఆలోచిస్తున్నారా? అని ఓ నాయకుడు అడిగిన ప్రశ్నకు తడుముకోకుండా.. ‘నేనెందుకు ఎన్నికల్లో పోటీ చేయాలి? నాకు అలాంటి ఆకాంక్షలు లేవు’ అని స్పష్టం చేశారు. తాను రాజకీయ చతురత లేని ధంధేబాజ్నే అయితే రెండేండ్లపాటు తన ఇంట్లో నితీష్ ఎందుకు ఉన్నాడో జేడీయూ నాయకులు ప్రశ్నించాలని సూచించారు. ఏడాదిలో 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న నితీష్ ప్రభుత్వం హామీపై స్పందించిన ప్రశాంత్ కిషోర్.. ఈ హామీని వాళ్లు నిజం చేసినట్లయితే ఈ ప్రచారాన్ని, పాదయాత్రను మానుకుంటానని చెప్పారు.
పశ్చిమ చంపారన్లో ఆదివారం నిర్వహించిన జిల్లా సదస్సు సందర్భంగా ఆయన మాట్లాడారు. జన్ సురాజ్ అభియాన్ను రాజకీయ పార్టీగా చేయాలా వద్దా అనే అంశంపై ప్రజల అభిప్రాయాలను సేకరించారు. ఈ విషయంపై ఆయన రాష్ట్రంలో 3,500 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఇదే తరహాలో ప్రజాపోరాట యాత్ర నిర్వహిస్తామని, దాని ఆధారంగా తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తామని ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు.