బెంగళూరు, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎన్నికల వేళ కర్ణాటకలో అమూల్ చిచ్చు రేగింది. తమ వ్యాపారాన్ని కర్ణాటకకు విస్తరించనున్నామని, త్వరలో బెంగళూరులో పాల ఉత్పత్తుల అమ్మకాలను ప్రారంభిస్తామని గుజరాత్కు చెందిన అమూల్ సంస్థ ఇటీవల పేర్కొన్నది. ఇప్పుడు ఈ వ్యవహారంపై అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్, జేడీఎస్ పక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తున్నది. కర్ణాటక పాడి ఉత్పత్తిదార్ల సహకార సంఘాల సమాఖ్య (కేఎంఎఫ్)ను గుజరాత్కు చెందిన అమూల్కు కట్టబెట్టేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని, అందుకు రాష్ట్రంలోని బీజేపీ సర్కార్ సహకరిస్తున్నదని విపక్షాలు మండిపడుతున్నాయి. కేఎంఎఫ్ బ్రాండ్ ‘నందిని’ని నిర్వీర్యం చేసి, రాష్ట్రంలో పాల ఉత్పత్తుల వ్యాపారాన్ని అమూల్కు హస్తగతం చేయాలని బీజేపీ చూస్తున్నదని ఆరోపిస్తున్నాయి.
అమిత్షా బహిరంగ ప్రకటన
నందినిని అమూల్కు అమ్మేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్న విషయం స్పష్టంగా తెలుస్తున్నదని కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలా అన్నారు. ఈ విషయాన్ని అమిత్షా బహిరంగంగా చెప్పారని, దీనికి రాష్ర్టానికి చెందిన బీజేపీ ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి శోభా కరంద్లజే కూడా మద్దతు పలికారని పేర్కొన్నారు. నందినిని కాపాడుకోవాలంటే, వచ్చే ఎన్నికల్లో బీజేపీకి బుద్ధి చెప్పాలని జేడీఎస్ నేత, మాజీ సీఎం కుమారస్వామి రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. మరోవైపు ‘అమూల్ను అడ్డుకోండి’ అంటూ ఆన్లైన్ ఉద్యమం సాగుతున్నది.