న్యూఢిల్లీ: రాజకీయ పాలకులు కాలానుగుణంగా మారుతుంటారు, కానీ సంస్థాగతంగా మీరు శాశ్వతం అని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)ని ఉద్దేశించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ అన్నారు. సీబీఐ వ్యవస్థాపక డైరెక్టర్ డీపీ కోహ్లీ 19వ స్మారక ఉపన్యాసం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ కీలక ప్రసంగం చేశారు. ‘పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కాలానుగుణంగా మారుతుంది. కానీ ఒక సంస్థగా మీరు శాశ్వతంగా ఉంటారు. దృఢంగా, స్వతంత్రంగా ఉండండి. మీ సేవకు కట్టుబడి ఉండండి. మీ సోదరభావమే మీ బలం’ అని అన్నారు.
కాగా, సీబీఐ ప్రతిష్ఠ దిగజారడంపై సీజేఐ రమణ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రారంభంలో సీబీఐపై ప్రజల్లో అపారమైన నమ్మకం ఉండేదని గుర్తు చేశారు. కేసుల దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాలంటూ కోర్టులకు కుప్పలుగా అభ్యర్థనలు వచ్చేవని తెలిపారు. అయితే ఇటీవల కాలంలో దాని చర్యలు, దర్యాప్తు తీరు, విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారిందన్నారు.
విధి నిర్వహణలో పోలీస్ అధికారులు ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొంటారని సీజేఐ రమణ అన్నారు. కొన్ని సందర్భాల్లో సైకాలజిస్ట్, టీచర్, కౌన్సెలర్, లాయర్, సూపర్ హీరో వంటి పాత్రలు పోషించాల్సి ఉంటుందన్నారు. అయితే రాజకీయ గురువులు పోలీసులను దుర్వినియోగం చేయడం కొత్త లక్షణం కాదన్నారు. బ్రిటిష్ సామ్రాజ్య ఆధిపత్యం, నిఘా, అధికార బలం భారతీయ పోలీసుల్లో శాశ్వత లక్షణంగా మిగిలిపోయిందని వ్యాఖ్యానించారు.
పోలీసులు నిష్పక్షపాతంగా పని చేయాలని, నేరాల నివారణపై దృష్టి సారించాలని భారత ప్రధాన న్యాయమూర్తి రమణ సూచించారు. పోలీసులు, దర్యాప్తు సంస్థలతో సహా అన్నింటికి ప్రజాస్వామ్య విలువలను ఆపాదించడం, బలోపేతం చేయడం చాలా అవసరమన్నారు. రాజ్యాంగం పేర్కొన్న ప్రజాస్వామ్య చట్రంలోనే వ్యవస్థలన్నీ పని చేయాల్సి ఉందన్నారు. గాడి తప్పితే సంస్థలను దెబ్బతీయడంతోపాటు మన ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తుందని అన్నారు.
పోలీసులు, దర్యాప్తు సంస్థలకు డి-ఫాక్టో చట్టబద్ధత ఉండవచ్చు, కానీ ఇప్పటికీ సంస్థలుగా అవి సామాజిక చట్టబద్ధతను పొందాల్సి ఉందని జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. సీబీఐ, ఎస్ఎఫ్ఐఓ, ఈడీ వంటి వివిధ ఏజెన్సీలను ఒకే తాటిపైకి తీసుకురావడానికి, స్వతంత్ర గొడుగు సంస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.