Parliament security breach | న్యూఢిల్లీ : పార్లమెంట్ లోపల, బయట కలర్ స్మోక్ వదిలిన ఘటనపై యావత్ దేశం ఉలిక్కి పడిన సంగతి తెలిసిందే. ఈ దాడి వ్యూహకర్త లలిత్ ఝాతో పాటు మిగతా నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. లలిత్ ఝాను పోలీసులు విచారిస్తున్నారు. ఇక సాగర్ శర్మ, మనోరంజన్, నీలం, అమోల్ షిండే పోలీసుల కస్టడీలో ఉన్నారు. అయితే డిసెంబర్ 13వ తేదీన జరిగిన కలర్ స్మోక్ ఘటనను రీక్రియేట్ చేయాలని ఢిల్లీ పోలీసులు యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి.
లలిత్ ఝాతో పాటు సాగర్, నీలం, మనోరంజన్, అమోల్ను శని లేదా ఆదివారాల్లో పార్లమెంట్ వద్దకు తీసుకెళ్లి సీన్ రీక్రియేషన్ చేయనున్నట్లు సమాచారం. నాలుగు అంచెల భద్రతను, ఫుల్ బాడీ స్కానర్లను తప్పించుకొని నిందితులు కలర్ స్మోక్ను లోక్సభ మందిరంలోకి ఎలా తీసుకెళ్లగలిగారు..? లోక్సభలో తమ ప్లాన్ను ఎలా అమలు చేశారు..? వంటి అంశాలను తెలుసుకునేందుకు ఈ సీన్ రీక్రియేషన్ ఉపయోగపడుతుందని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు పేర్కొన్నారు. వాస్తవానికి ఈ ఘటన జరిగిన రోజే సీన్ రీక్రియేషన్ చేపట్టాలని పోలీసులు భావించినప్పటికీ, సభా కార్యకలాపాల వల్ల అది సాధ్యం కాలేదు. శని, ఆదివారాల్లో పార్లమెంట్ సమావేశాలు లేకపోవడంతో ఆ రోజుల్లో సీన్ రీక్రియేషన్ చేపట్టాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ సీన్ రీక్రియేషన్తో పాటు నిందితులు నివాసమున్న గురుగ్రామ్లోని ఫ్లాట్కు కూడా తీసుకెళ్లనున్నారు. అక్కడే ఈ దాడికి రూపకల్పన చేసినట్లు పోలీసులు తెలిపారు. గత 15 రోజుల్లో నిందితులు ఎవరెవరికి ఫోన్ చేశారన్న జాబితాను కూడా పోలీసులు సేకరించినట్లు సమాచారం. వారందరికీ ఫోన్లు చేసి విచారించే అవకాశం ఉంది. ఈ ఘటనకు కుట్ర పన్నింది ఆరుగురేనా.? లేక వీరి వెనుక ఇంకెవరైనా పెద్ద వ్యక్తులు ఉన్నారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.