Pune Porsche Crash | పుణె, మే 27: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహారాష్ట్రలోని పుణె యాక్సిడెంట్ కేసులో హైడ్రామా నడుస్తున్నది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మైనర్ను తప్పించేందుకు అతని తండ్రి అడ్డదారులు తొక్కుతున్నాడు. కేసులో తమ కుమారుడు చిక్కకుండా ఆ 17 ఏండ్ల టీనేజర్ తండ్రి జిమ్మిక్కులకు పాల్పడుతున్న వైనాన్ని పుణె పోలీసులు తాజాగా బహిర్గతం చేశారు. రక్తంలో ఆల్కహాల్ ఆనవాళ్లు తేలకుండా చేసేందుకు ఏకంగా రక్త నమూనా నివేదికను తారుమారు చేశారట. పరీక్ష నిమిత్తం నిందితుడి నుంచి తీసుకొన్న రక్తాన్ని చెత్తకుప్పలో పడేసి, దాని స్థానంలో వేరే వ్యక్తి రక్తాన్ని పెట్టి, నివేదికను రూపొందించినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ మేరకు నివేదిక తయారు చేసేందుకు నిందితుడి తండ్రి ప్రభుత్వ దవాఖాన వైద్యులతో బేరసారాలు నడిపినట్టు పుణె పోలీసు కమిషనర్ అమితేశ్ కుమార్ సోమవారం మీడియా సమావేశంలో వెల్లడించారు.
ఈ తతంగానికి సంబంధించి సస్సూన్ జనరల్ హాస్పిటల్కి చెందిన ఫోరెన్సిక్ మెడికల్ విభాగం హెడ్ డాక్టర్ అజయ్ తావరే, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీహరి హల్నోర్ను అరెస్టు చేశామని తెలిపారు. ఆదివారం వైద్యుల నుంచి అందుకొన్న నివేదికలో నిందితుడి రక్తంలో ఆల్కహాల్ ఆనవాళ్లు లేవని పేర్కొన్నారని, అయితే డాక్టర్ అజయ్ తావరే డైరెక్షన్లో రక్తనమూనాలను తారుమారు చేసినట్టు తమ దర్యాప్తులో తేలిందని అమితేశ్ కుమార్ పేర్కొన్నారు. ఇద్దరు టెకీలు మరణించిన ఈ యాక్సిడెంట్ను చేసిన సమయంలో నిందితుడైన మైనర్ మద్యం సేవించినట్టు పోలీసులు చెబుతున్నారు. పుణె పోలీసు కమిషనర్ అమితేశ్ కుమార్ మరో కీలక విషయం వెల్లడించారు. ముందస్తు జాగ్రత్తగా డీఎన్ఏ పరీక్ష కోసం తాము నిందితుడి నుంచి మరో రక్త నమూనాను తీసుకొని, దాన్ని వేరే దవాఖానకు పంపించామని తెలిపారు. సస్సూన్ దవాఖాన వైద్యులు ఇచ్చిన నివేదికను తారుమారు చేసినట్టు మరో దవాఖాన నివేదిక తేల్చిందని పేర్కొన్నారు.