Bihar | కతీహార్: ప్రజల కనీస అవసరాలు తీర్చలేని బీహార్ ప్రభుత్వం సామాన్యులపై జులుం ప్రదర్శించింది. కోతల్లేని కరెంటు కావాలని కోరిన సామాన్యులను కాటికి చేర్చింది. కరెంటు కోతలతో విసిగివేసారిన సామాన్యులు రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగగా వారిపై ప్రభుత్వం కాల్పులకు తెగబడింది. నిత్యం కోతలతో ఇబ్బందులుపడ్డ సామాన్యులు ఆందోళనలకు పిలుపునివ్వడమే వారి పాలిట శాపంగా మారింది. కరెంటు కావాలని అడిగిన పాపానికి వారిపై బుల్లెట్ల వర్షం కురిపించింది. దీంతో ముగ్గురు మరణించారు. ఈ ఘటన బుధవారం కతీహార్ జిల్లాలో చోటుచేసుకున్నది. నిత్యం సరిగా కరెంటు ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయంటూ స్థానికులు బార్సోయ్ బ్లాక్ కార్యాలయాన్ని ముట్టడించారు. వీరిని అదుపు చేయడానికి పోలీసులు ప్రయత్నించారు.
ఈ క్రమంలో ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణ చోటుచేసుకున్నది. దీంతో పోలీసులు కాల్పులు జరిపారు. పోలీసు కాల్పుల్లో ఘటనాస్థలంలోనే ఒకరు మరణించగా.. చికిత్స పొందుతూ మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం కతీహార్ జిల్లా అంతటా వ్యాపించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. దీంతో ఆ ప్రాంతంలో భారీగా బలగాలను మోహరించారు. ఓ ఆందోళనకారుడు మాట్లాడుతూ ‘శాంతియుతంగానే నిరసన చేస్తున్నాం. కానీ పోలీసులు మాపై కాల్పులు జరిపారు. దీంతో ఐదుగురికి బుల్లెట్ గాయాలు కాగా.. ముగ్గురు మరణించారు’ అని తెలిపారు.