వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానాలో రైతుల ర్యాలీ
చండీగఢ్, జూన్ 26: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఉద్యమానికి ఏడు నెలలు పూర్తయిన సందర్భంగా పంజాబ్, హర్యానాలలోని రైతులు శనివారం భారీ ర్యాలీ చేపట్టారు. ఇరు రాష్ర్టాలకు చెందిన రైతులు రాజ్భవన్లో గవర్నర్కు మెమొరాండం ఇచ్చేందుకు పెద్ద సంఖ్యలో తరలిరాగా వారిని రాజధాని సరిహద్దుల్లోనే పోలీసులు అడ్డుకున్నారు. రైతులపై జల ఫిరంగులు ప్రయోగించారు. పంజాబ్లోని మొహాలి నుంచి, హర్యానాలోని పంచకుల నుంచి వచ్చే రైతులను అడ్డుకునేందుకు పోలీసులు చండీగఢ్ చుట్టూ బారికేడ్లను ఏర్పాటుచేశారు. ఈ ర్యాలీలో రైతు సంఘం నాయకులు యోగేంద్ర యాదవ్, బల్బీర్ సింగ్ రాజేవాల్, గుర్నామ్ సింగ్లు పాల్గొన్నారు. రైతుల తరఫున వీరు పంజాబ్, హర్యానా గవర్నర్లకు మెమొరాండం అందజేశారు. కాగా, రైతులు తమ నిరసనలు ఆపాలని, వారితో చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. కేంద్రంతో రైతు సంఘాల నాయకులు ఇప్పటికే 11 సార్లు చర్చలు జరిపినా ఫలితం తేలకపోవడంతో రైతులు నిరసనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.