న్యూఢిల్లీ, మార్చి 26: ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా ఆప్ శ్రేణులు మంగళవారం ప్రధాని నరేంద్రమోదీ ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించాయి. అయితే పోలీసులు వారిపై ఉక్కుపాదం మోపారు. ప్రధాని నివాసం వైపుగా ఆప్ కార్యకర్తలు రాకుండా అన్ని మార్గాలను అష్టదిగ్బంధం చేశారు.
ఆప్ ఆందోళన నేపథ్యంలో ముందుగానే ఢిల్లీ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు.. లోక్కల్యాణ్ మార్గ్లోని మోదీ నివాసం వద్ద పెద్దయెత్తున బలగాలను మోహరించారు. ప్రధాని ఇంటికి వెళ్లే అన్ని మార్గాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ ఇంటి చుట్టు పక్కల ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. పోలీసుల ఆంక్షల నడుమే ఆప్ నేతలు, కార్యకర్తలు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేపట్టగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.
పోలీసులు అరెస్టు చేసిన వారిలో ఆప్ సీనియర్ నేత సోమనాథ్ భారతి, ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రాఖి బిర్లా, పంజాబ్ మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్ తదితరులు ఉన్నారు. మరోవైపు ఆప్ ఆందోళనలకు కౌంటర్గా బీజేపీ కూడా ఆందోళన చేపట్టింది. కేజ్రీవాల్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్తో ఫిరోజ్షా కోట్ల మైదానం నుంచి ఢిల్లీ సెక్రటేరియట్ వైపుగా బీజేపీ నేతలు మార్చ్ చేశారు. ఈ క్రమంలో వారిని అడ్డుకొన్న పోలీసులు.. ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవతోపాటు 57 మంది బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకొన్నారు.
కస్టడీ నుంచి రెండో ఆదేశాలు
ఈడీ కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. రెండోసారి పాలనాపరమైన ఆదేశాలు జారీచేశారు. నగరంలోని మొహల్లా క్లినిక్స్, దవాఖానల్లో మందులు, రోగ నిర్ధారణ పరీక్షల కొరత లేకుండా చూడాలని సూచించారని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సౌరవ్ భరద్వాజ్ మంగళవారం వెల్లడించారు. కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ప్రభుత్వ పథకాలు ఆగిపోతాయని వస్తున్న పుకార్లపై ఢిల్లీ ప్రభుత్వం స్పందించింది. అలాంటి తప్పుడు సమాచారాన్ని ప్రజలెవరూ నమ్మవద్దని ప్లానింగ్ విభాగం ప్రకటన విడుదల చేసింది.
పారదర్శక విచారణ జరగాలన్న యూఎస్
కేజ్రీవాల్ అరెస్టుపై అమెరికా స్పందించింది. పారదర్శక, నిష్పక్షపాత న్యాయప్రక్రియ జరుగుతుందని ఆశిస్తున్నామని పేర్కొన్నది. అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రాయిటర్స్తో మాట్లాడుతూ కేజ్రీవాల్ అరెస్టుకు సంబంధించిన నివేదికలను పరిశీలిస్తున్నామని తెలిపారు. కేజ్రీవాల్ విషయంలో పారదర్శక, నిష్పక్షపాత, సమయానుకూల న్యాయప్రక్రియ ఉండేలా భారత్ను ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు.
కేజ్రీ సవాల్ పిటిషన్పై నేడు విచారణ
మద్యం పాలసీ కేసులో తనను ఈడీ అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు బుధవారం విచారణ చేయనున్నది. తన అరెస్టు, ఈడీ రిమాండ్ అక్రమమని, తనను వెంటనే విడుదల చేయాలని కేజ్రీవాల్ న్యాయస్థానానికి విన్నవించారు.