లక్నో : యూపీలోని గొండా రిజర్వ్ పోలీస్ లైన్లో నిర్వహించిన బడా ఖానా పోటీలో హెడ్ కానిస్టేబుల్ హృషీకేష్ రాయ్ ఏకంగా 60 పూరీలు తిని తన రికార్డును తానే అధిగమించాడు. రిక్రూట్స్ పాసింగ్ అవుట్ పరేడ్కు ముందు మంగళవారం రాత్రి బడా ఖానా పోటీని చేపట్టారు. నూతన రిక్రూటర్లు, ఉద్యోగులు కలిసి భోజనం చేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఎప్పటినుంచో ఆనవాయితీగా జరుగుతోంది.
ఈ పోటీలో భాగంగా ఎక్కువ పూరీలు తిన్న వారిని సన్మానించారు. గతంలో 51 పూరీలు తిని రికార్డు నెలకొల్పిన హృషీకేష్ రాయ్ ఈసారి పోటీలో 60 పూరీలను లాగించి తన రికార్డును తానే బద్దలు కొట్టాడు. ఈ పోటీలో గెలిచిన రాయ్కు రూ 1000 నగదు బహుమతిని అధికారులు అందించారు. రాయ్ చిన్నతనంలో 160 పూరీలను కూడా తినేవాడని చెబుతున్నారు. బడా ఖానా ఈవెంట్కు సంబంధించి ఫోటోలు, వీడియోలను గొండా పోలీసులు ట్వీట్ చేశారు.
ఇక బడా ఖానా పోటీలో 48 పూరీలు తిన్న రిక్రూట్ కానిస్టేబుల్ అమిత్ కుమార్ సింగ్కు రెండవ బహుమతి లభించింది. ఈ పోటీలో గెలిచిన విజేతలకు ఎస్పీ సంతోష్ కుమార్ మిశ్రా నగదు బహుమతులు అందచేశారు. శిక్షణలో ఉన్నరిక్రూట్స్కు స్వయంగా వడ్డించిన ఎస్పీ వారితో నేలపై కూర్చుని తిన్నారు. అధికారులు, రిక్రూట్ల మధ్య సన్నిహిత సంబంధాలను, ఆహ్లాదకర వాతావరణం ఏర్పాటయ్యేందుకు దోహదపడే ఇలాంటి కార్యక్రమాలను తరచూ ఏర్పాటు చేయాలని ఎస్పీ కోరారు.