Manipur Violence | ఇంఫాల్/న్యూఢిల్లీ, జూలై 7: ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. తాజాగా గురువారం రాత్రి, శుక్రవారం బిష్ణుపూర్ జిల్లా కంగ్వాయి ఏరియాలోని గ్రామాల్లో రెండు కమ్యూనిటీల మధ్య కాల్పులు చోటుచేసుకొన్నాయి. ఈ ఘటనల్లో నలుగురు మరణించగా, పలువురికి గాయాలయ్యాయి. మృతుల్లో పోలీసు కమాండో, టీనేజర్ ఉన్నారు. కొండ ప్రాంతాల నుంచి కొంతమంది కిందకు వచ్చి, లోయలోని పలు గ్రామాలను తగులబెట్టేందుకు ప్రయత్నించారని, వెనక్కు వెళ్లిపోవాలని స్థానికులు కోరినా పట్టించుకోలేదని అధికారులు తెలిపారు. ఏ ఇంటికీ నిప్పంటించకుండా భద్రతా బలగాలు నియంత్రించగలిగాయి. అయితే రెండు గ్రూపులకు చెందిన వారు కాల్పులకు దిగారని తెలిపారు.
జమ్ముకశ్మీర్, పంజాబ్లలో గతంలో జరిగిన తారాస్థాయి ఘర్షణల కంటే మణిపూర్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఆ రాష్ట్ర మాజీ గవర్నర్ గుర్బచన్ జగత్ ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసు స్టేషన్లపై దాడులు జరుగుతున్నాయని, ఆయుధాలు, మందుగుండు సామగ్రి లూటీకి గురైందని పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్, పంజాబ్, ఢిల్లీ, గుజరాత్ వంటి రాష్ర్టాల్లో చోటుచేసుకొన్న విపత్కర సమయాల్లో కూడా ఇలాంటివి జరుగలేదని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన ఓ వార్తాపత్రికలో ఆర్టికల్ రాశారు. ఆయన గతంలో జమ్ముకశ్మీర్, పంజాబ్లలో ఐపీఎస్ అధికారిగా పనిచేశారు.
కేంద్రం, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాల కారణంగా మణిపూర్ పౌరులు సొంత దేశంలోనే శరణార్థులుగా బతకాల్సి వస్తున్నదని సీపీఐ ఎంపీ బినోయ్ విశ్వం ఆరోపించారు.
మణిపూర్ పరిస్థితులపై అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి స్పందించారు. కోల్కతాలో గురువారం మీడియా అడిగిన ఓ ప్రశ్నకు స్పందిస్తూ మణిపూర్లో పరిస్థితులను చక్కదిద్దే విషయంలో భారత్ కోరితే.. ఏ రూపంలోనైనా సహకరించేందుకు అమెరికా సిద్ధంగా ఉన్నదని పేర్కొన్నారు. ఇది భారత్ అంతర్గత విషయం అని పేర్కొంటూనే.. శాంతి లేకుండా ఈశాన్యంలో పురోగతి సాధ్యం కాదన్నారు. అమెరికా స్పందనపై కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ ఘాటుగా స్పందించారు. తన నాలుగు దశాబ్దాల రాజకీయం జీవితంలో, భారత అంతర్గత విషయాల్లో ఒక అమెరికా రాయబారి మాట్లాడటం చూడలేదని అన్నారు.