తెలంగాణ 59 ఏండ్లు తన అభివృద్ధిని, విద్యను, ఉపాధిని, ఉత్పత్తిని ఏ మేరకు నష్టపోయిందో గమనిస్తే.. ప్రతి తెలంగాణ వాసి కండ్లలోకి నీళ్లొస్తాయి. రెండు జీవనదుల నుంచి మన నీటి వాటా వాడుకోలేని నష్టమే సుమారు 11 లక్షల కోట్లు. ఉమ్మడి రాష్ట్రంలో మన జనాభా 42 శాతం. 59 ఏండ్ల బడ్జెట్ కేటాయింపులలో తెలంగాణ వాటా 29 శాతం మాత్రమే. ఆ విధంగా జరిగిన అన్యాయాన్నివెలకట్టి చెప్పాలంటే తెలంగాణ కొన్ని తరాల జీవితకాలాన్నే కోల్పోయింది. అలాంటి నష్టాన్ని లెక్కలు కట్టి ఇవ్వాలని కూడా ఇవాళ ఎవరూ డిమాండ్ చేయడం లేదు. కనీసం విభజన చట్టంలో ఇచ్చిన హామీలనైనా అమలుచేయని వారిపైనే చర్చ.
రాష్ట్ర విభజన జరిగి ఏడేండ్లయినా కొన్ని హామీలు ఇంకా ఢిల్లీలోనే మూల్గుతున్నాయంటే ఏమందాం? విభజన చట్టానికి కేంద్రం ఇస్తున్న విలువ ఏమిటి? కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి రాష్ట్రం పట్ల ఏమైనా బాధ్యత కనిపిస్తున్నదా? ఉమ్మడి రాష్ట్రంలో వ్యవహరించిన తీరే ప్రతిపక్షాల్లో ఇప్పటికీ కనిపించడం దురదృష్టకరం. రాష్ట్ర బాగోగులు అంతా కేసీఆర్ బాధ్యతే తప్ప మా బాధ్యత కాదన్న ధోరణి ఆ పార్టీల్లో స్పష్టంగా కనిపిస్తది. బాధ్యత కేసీఆర్ మీద పెట్టి తెలంగాణ ఓట్లు ఎలా అడుగుతారనే చర్చ రావడమూ సహజమైనదే. బాధ్యత పట్టని రాజకీయాలు తెలంగాణకు అవసరమా అనే చర్చ ఈ మధ్య బాగానే జరుగుతున్నది. రాష్ట్రం పట్టని వాళ్లకు ఓట్లెందుకు వేయాలని ప్రజలు తిరగబడి ప్రశ్నిస్తే రెండు జాతీయ పార్టీల దగ్గర జవాబులు ఉన్నాయా?
బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ- విభజన చట్టంలో ఇచ్చిన హామీలు. అవి చట్టబద్ధమైన హామీలు. రాష్ట్ర ప్రభుత్వం 160 ఎకరాల భూమిని కేటాయించాక కూడా కోచ్ ఫ్యాక్టరీని రద్దు చేశామని ఆ మధ్యనే కేంద్రం ప్రకటించింది. ఇక బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఊసే లేదు. వాస్తవానికి విభజన చట్టంలో తెలంగాణకు, ఏపీకి ఒక్కో ఉక్కు ఫ్యాక్టరీకి హామీ ఇచ్చారు. హామీ ప్రకారం ఏపీలోని కడపలో ఇప్పటికే ఉక్కుఫ్యాక్టరీ స్థాపించారు. మొన్ననే దానికి పర్యావరణ అనుమతులు కూడా ఇచ్చారు. కానీ అదే చట్టంలో తెలంగాణకిచ్చిన బయ్యారం ఉక్కుఫ్యాక్టరీ హామీ ఏమైనట్లు? ఒకే విభజన చట్టంలో ఇచ్చిన రెండు హామీలలో ఒకటి అమలు కావడమేమిటి? మరొకటి కాకపోవడమేమిటి? ఒక రాష్ట్రం పట్ల అది వివక్ష కాకపోతే ఏమవుతుంది? పార్లమెంటు ఆమోదించిన హామీలనూ రద్దుచేయవచ్చా? అలా జరిగిన సంఘటన దేశ చరిత్రలో ఉన్నదా? చట్టాన్ని ఉల్లంఘించడం కాదా అది? కడుపులో కత్తులు, మాటల్లో ప్రశంసలు తప్ప కేంద్రం తెలంగాణకు చేసిన న్యాయం ఏముందని?
కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్రంలో బాగానే ఊరేగుతున్నది. ఉల్లంఘనలు మా హక్కే, విమర్శలు చేయడమూ మా హక్కే అన్నట్లుంది ఆ పార్టీ వ్యవహారం! చట్టబద్ధ హామీల అమలుకే దిక్కులేదు, ఇక రాష్ర్టానికి ఉదారంగా చేసిన సహకారాల సంగతి దేవుడెరుగు. అయినా దేశ జీడీపీ కన్నా రాష్ట్ర జీడీపీని మెరుగ్గా కొసాగిస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది కేసీఆర్ ప్రభుత్వమేనని గర్వంగా చెప్పొచ్చు. దేశ జీడీపీ ఘోరంగా మైనస్ శాతానికి పడిపోయినా.. రాష్ట్రంలో ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి, ఉత్పత్తికి ఎలాంటి ఆటంకాలు రాకుండా పాలించగలుగుతున్న ఘనత ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుంది. అందుకే ఇవాళ దేశంలో తెలంగాణ రాష్టాన్ని ప్రగతిశీల రాష్ట్రం (ప్రోగ్రెసివ్ స్టేట్) అని ఆర్థికవేత్తలు సైతం అంగీకరిస్తున్నారు. కేంద్రం నుంచి మరింత సహకారం అందితే అది రాష్ర్టానికే కాకుండా ఈ దేశానికే ప్రయోజనం. కానీ కేంద్ర ప్రభుత్వ ధోరణి అలా కనిపించదు.
కేంద్రం వివక్ష ధోరణిని, ద్వంద్వ వైఖరిని, రాష్ట్రంలో బాధ్యతారాహిత్య విపక్షాల పోకడను విద్యావంతులైన పట్టభద్రులకు తెల్పడంలో కేటీఆర్ సఫలమయ్యారనే చెప్పాలి. ఆరేండ్లలో 1.32 లక్షల ఉద్యోగ నియామకాలు చేశామని శాఖలవారీగా వివరాలు బహిరంగంగా వెల్లడించారు. అందులో టీఎస్పీఎస్సీ ద్వారా 35839 ఉద్యోగ నియామకాలు చేశామని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో 2004 నుంచి 14 వరకు పదేండ్లలో నియామకాలు 24086 మాత్రమేనని వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో కన్నా మూడింతలు అధికంగా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నింపామని చెప్పారు. అదొక తిరుగులేని జవాబుగా మారింది. దాంతో ప్రతిపక్షాలు ఇరుకునపడ్డాయి. ఉత్తరప్రదేశ్ జనాభా సుమారు 20 కోట్లు. తెలంగాణ జనాభా 4 కోట్లు. అంటే తెలంగాణతో ఐదింతలు గల యూపీలో ఐదేండ్లలో చేసిన ఉద్యోగ నియామకాలు 20 వేల లోపే. అలాంటపుడు కేంద్రంలో, మరో 12 రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న ఆ పార్టీ, తెలంగాణలో ఉద్యోగ నియామకాల గురించి మాట్లాడటం విద్యావంతులకు హాస్యాస్పదం అనిపించదా? కచ్చితంగా అనిపిస్తుంది!
అటు విభజనచట్టాన్ని అమలుచేయకపోవడం, ఇటు ప్రోగ్రెసివ్ స్టేట్ను పట్టించుకోకపోవడం, ఇపుడు ఉద్యోగాల భర్తీపై గోల చేయడం చూస్తే.. బీజేపీకి ఎలా ఓటేయాలి? అనే సందేహం పట్టభద్రులకు రాదంటారా? తప్పక వస్తుంది! ఉద్యోగం, నిరుద్యోగం ప్రపంచవ్యాప్త సమస్యే. వాటి పరిష్కారమూ నిరంతర ప్రక్రియే. దాన్ని తామెప్పుడూ విస్మరించేది లేదనే సందేశాన్ని కూడా కేటీఆర్ విద్యావంతులకు పంపగలిగారు. ఇతరులలాగా ఉన్న ఉద్యోగాలను తామెన్నడూ రద్దుచేయలేదన్నారు. ఉన్న ఉద్యోగాలను రద్దుచేస్తున్నవారిని గమనించి ఓటేయాలని చెప్పారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం- ప్రభుత్వ రంగాన్ని అమ్ముతున్నది, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం- ప్రభుత్వ రంగాన్ని (ఆర్టీసీ, సింగరేణి వగైరా) కాపాడుతున్నది. తెలంగాణ పట్టభద్రుల్లో ఈ మాత్రం ఆలోచన లేదని కాదు. అందుకే ప్రగతిశీల రాష్ర్టాన్ని నిలబెట్టుకోవడం, గెలిపించుకోవడం వారి బాధ్యతే అన్న కేటీఆర్ సందేశం బలంగా వెళ్లింది. పట్టభద్రుల తీర్పుపై కేటీఆర్ ప్రచార ప్రభావం తప్పక ఉండనున్నదని విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.
-కల్లూరి శ్రీనివాస్రెడ్డి