హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): నడవలేనివారిని తెలంగాణ సర్కారు నడిపిస్తున్నది! అంధులకు దారి చూపుతున్నది! వినికిడి లోపం ఉన్నవారికి వినిపించేలా సహకరిస్తున్నది. అర్హులైన దివ్యాంగులకు త్రిచక్ర మోటర్ బైక్లు, స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు, ఇతర పరికరాలు అందజేస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ దశల్లో నిర్వహించిన సదరం క్యాంపుల ద్వారా 7,81,429 మంది దివ్యాంగులు ఉన్నట్టు గుర్తించారు. వీరికి నెలనెలా సర్కారు రూ. 3016 చొప్పున ఆసరా పింఛన్లు అందిస్తున్నది. దివ్యాంగుల అభివృద్ధి, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న కార్యక్రమాల వల్ల జాతీయస్థాయిలో రెండుసార్లు అవార్డులు సొంతం చేసుకున్నది. రాష్ట్రంలో 16,600 మంది అర్హులైన దివ్యాంగులకు ఈ ఏడాది రూ.24.37 కోట్ల విలువైన వివిధ రకాల ఉపకరణాలను ఉచితంగా అందజేస్తున్నది. లబ్ధిదారుల ఎంపికలో పైరవీలకు అవకాశం లేకుండా ఆన్లైన్ విధానాన్ని అనుసరించి పారదర్శకతను పాటిస్తున్నది. జిల్లాలకు నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా లబ్ధిదారుల ఎంపికలో జిల్లాస్థాయి కమిటీలోని ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఉపకరణాలు పంపిణీ చేస్తున్నారు.
నేడు ఉపకరణాల పంపిణీ
ఎల్బీ స్టేడియంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు అర్హులైన దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వికలాంగుల సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తదితరులు హాజరుకానున్నట్టు వికలాంగులశాఖ డైరెక్టర్ శైలజ తెలిపారు.
ఈ ఏడాది రాష్ట్రంలో పంపిణీ చేసే పరికరాలు
త్రిచక్ర (రిట్రోపిట్డెడ్) మోటార్ బైక్లు 900, బ్యాటరీ వీల్చైర్స్ 650, ల్యాప్టాప్లు 300, 4జీ స్మార్ట్ఫోన్లు 400, డైసీ ప్లేయర్స్ 120, త్రిచక్ర వాహనాలు 1,500, వీల్ చైర్స్ 2,000, చంక కర్రలు 3,000, వినికిడి యంత్రాలు 1,460, అంధుల చేతికర్రలు 2,065, ఎంపీ-3 ప్లేయర్స్ 800, బ్రెయిలీ బుక్స్ 478, ఇన్నొవేటివ్ స్మార్ట్ కేన్స్ 165, ఇన్నొవేటివ్ వీల్స్చైర్స్ ఫర్ క్రికెటర్స్ 13, ఇన్నొవేటివ్ క్రచెర్స్ 155, ఆర్టిఫిషియల్ లింబ్స్ 334, క్యాలీపెర్స్ 260, బ్యాటరీ ట్రై సైకిళ్లు 2,000.