చెన్నై: నకిలీ పాస్పోర్ట్లు (fake passports) అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వందకుపైగా నకిలీ పాస్పోర్ట్లు, విదేశీ కరెన్సీ, నకిలీ స్టాంపులు, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం వెతుకుతున్నారు. తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ సంఘటన జరిగింది. జూలై 7న ఆంథోనిసామి అనే వ్యక్తి నకిలీ పాస్పోర్ట్తో మలేషియా వెళ్లేందుకు ప్రయత్నించాడు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఇమ్మిగ్రేషన్ అధికారులు దీనిని గుర్తించి అతడ్ని పోలీసులకు అప్పగించారు. అలాగే నకిలీ పాస్పోర్టు వ్యవహారం గురించి చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్కు ఫిర్యాదు చేశారు.
కాగా, క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దీనిపై దర్యాప్తు జరిపారు. నకిలీ పాస్పోర్ట్ల ద్వారా పలువురు వ్యక్తులను అక్రమంగా మలేషియా వంటి విదేశాలకు పంపుతునట్టు తెలుసుకున్నారు. ప్రధాన నిందితుడైన 45 ఏండ్ల మహ్మద్ ఫిరోజ్ ఖాన్ను అరెస్ట్ చేశారు. 105 నకిలీ పాస్పోర్ట్లు, మలేషియా, థాయిలాండ్, సింగపూర్ వంటి దేశాలకు చెందిన విదేశీ కరెన్సీ, నకిలీ స్టాంపులు, ప్రభుత్వం, ఇతర సంస్థలకు చెందిన ముద్రలు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వంటివి నిందితుల ఇండ్ల నుంచి స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడు, నకిలీ పాస్పోర్ట్ ఏజెంట్ సయ్యద్ అబుదాహిర్ కోసం పోలీసులు వెతుకుతున్నారు.