శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులపై భద్రతా బలగాలు మరోసారి పైచేయి సాధించాయి. కుల్గాంలో (Kulgam) ఇద్దరు ఉగ్రవాదులను అరెస్టు చేశారు. కుల్గామ్లోని హడిగాం ప్రాంతంలో ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు బుధవారం తెల్లవారుజామున సంయుక్తంగా గాలింపు చేపట్టాయి. ఈక్రమంలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.
అయితే ఉగ్రవాదుల తల్లిదండ్రులను పోలీసులు ఘటనా స్థలానికి తీసుకొచ్చారు. పోలీసులు, వారి తల్లిదండ్రులు లొంగిపోవాలని కోరడంతో ఇద్దరు టెర్రరిస్టులు తుపాకులు వదిలి వచ్చారు. దీంతో వారిని అరెస్టు చేశామని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. వారివద్ద ఆయుధాలు, ముందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. వారిద్దరు స్థానిక ఉగ్రవాదులేనని, ఆ ప్రాంతంలో ఇంకా ఆపరేషన్ కొనసాగుతుందని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని వెల్లడించారు.