Shehnaz Akhtar : పాకిస్థాన్ (Pakistan) దేశానికి చెందిన ఒక మహిళ తన తండ్రితో గొడవపడి పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK) నుంచి భారత్ (India) లోకి ప్రవేశించింది. నియంత్రణ రేఖను దాటి జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లోని పూంచ్ జిల్లా (Poonch district) లోకి వచ్చిన ఆమెను భారత ఆర్మీ (Indian Army) దళాలు అదుపులోకి తీసుకున్నాయి.
సదరు మహిళను పాకిస్థాన్లోని కోట్లి ప్రాంతానికి చెందిన షెహ్నాజ్ అక్తర్ (35) గా గుర్తించారు. సరిహద్దులోని బాలాకోట్ సెక్టార్లో అనుమానాస్పదంగా సంచరిస్తుండటంతో ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. విచారణలో ఆమె.. తన తండ్రితో గొడవపడి ఇంటి నుంచి పారిపోయి ఎల్ఓసీ మీదుగా భారత్లోకి ప్రవేశించినట్లు చెప్పిందని అధికారులు వెల్లడించారు.
ఆమె భారత్లోకి అక్రమంగా ప్రవేశించడానికి ఇతర కారణాలేమైనా ఉన్నాయా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. విచారణ అనంతరం ఆ మహిళను పోలీసులకు అప్పగిస్తామని ఆర్మీ అధికారులు పేర్కొన్నారు.