న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: భారతదేశం ప్రగతిశీల పథంలో నడవాలంటే దేశానికి మెరుగైన విద్యార్హతలున్న ప్రధాని చాలా అవసరమని ఆప్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా పేర్కొన్నారు. ఢిల్లీ మద్యం కేసులో తీహార్ జైలులో రిమాండ్లో ఉన్న సిసోడియా స్వదస్తూరితో దేశ ప్రజలను ఉద్దేశించి లేఖ రాశారు. దీన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం ట్విట్టర్లో షేర్ చేశారు. ‘మోదీకి సైన్స్ అర్థం కాదు. విద్య ప్రాధాన్యం ఏమిటో కూడా ఆయనకు తెలియదు. తెలిస్తే ఆయన గత కొన్నేళ్లుగా 60 వేల పాఠశాలలు మూయించి ఉండేవారా?’ అని సిసోడియా ధ్వజమెత్తారు. పెద్దగా చదువుకోని ప్రధానితో దేశానికి చాలా ప్రమాదమని ఆయన అన్నారు.