న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయాన్ని నవంబర్ 5న ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించి, ఆలయంలో పూజలు చేయనున్నారు. ఈ సందర్భంగా జగద్గురువు ఆదిశంకరాచార్యుల సమాధి, విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. 2013 వరదల్లో సమాధి ధ్వంసం కాగా.. ప్రధాని మార్గదర్శకత్వంలో పునః నిర్మాణ పనులు చేపట్టారు. అలాగే సరస్వతీ ఆస్థపథ్ వెంట కొనసాగుతున్న పనులపై సమీక్ష నిర్వహించనున్నారు. ఈ క్రమంలో బహిరంగ సభలోనూ ప్రధాని ప్రసంగించనున్నారు.
సరస్వతి రిటైనింగ్ వాల్ ఆస్థపథ్, ఘాట్లు, మందాకిని రిటైనింగ్ వాల్ ఆస్థపథం, అర్చకులు గృహాలు, మందాకిని నదిపై గరుడ్ చట్టి వంతెనతో సహా నిర్మాణాలు పూర్తయిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. రూ.130కోట్లు వెచ్చించి వాటిని నిర్మించగా.. రూ.180 కోట్లతో సంగం ఘాట్ పునరాభివృద్ధి, ఫస్ట్ ఎయిడ్ – పర్యాటక సౌకర్యాల కేంద్రం, అడ్మిన్ కార్యాలయం అండ్ హాస్పిటల్, రెండు వసతి గృహాలు, పోలీస్స్టేషన్, కమాండ్ కంట్రోల్ సెంటర్, మందాకిని ఆస్థపథం పునరాభివృద్ధి తదితర ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు.