హైదరాబాద్: ఉత్తరప్రదేశ్లోని సుగంధ ద్రవ్యాల వ్యాపారి పీయూష్ జైన్ ఇంట్లో సుమారు 300 కోట్ల నగదును డీఆర్ఐ ఇంటెలిజెన్స్ అధికారులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. విదేశాలకు పర్ఫ్యూమ్లను అమ్మి అక్రమంగా సంపాదించినట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి. ఆదాయ పన్ను కట్టకుండా తిరుగుతున్న అతన్ని అరెస్టు చేశారు. అయితే ఈ విషయంపై ఇవాళ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ రియాక్ట్ అయ్యారు. యూపీలోని ఓ వ్యాపారవేత్త ఇంట్లో 180 కోట్లు ఎలా దొరికాయో ప్రధాని మోదీ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నోట్ల రద్దు జరిగినా.. అంత పెద్ద మొత్తంలో ఎలా ఓ వ్యాపారి ఇంటికి చేరినట్లు ఆయన ప్రశ్నించారు. ప్రధాని మోదీ రాత్రికి రాత్రే ఆకస్మికంగా పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం అత్యంత దారుణంగా విఫలమైనట్లు ఎంపీ అసద్ ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం చిన్నతరహా పరిశ్రమలను నాశనం చేసిందని, ఉద్యోగాల్ని ఛిన్నాభిన్నం చేసినట్లు అసద్ విమర్శించారు.