అహ్మదాబాద్ : అవినీతితో సామాన్యుల హక్కులకు విఘాతం కలుగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. అవినీతి దేశ పురోగతికి అడ్డంకిగా మారి మన శక్తియుక్తులను నీరుగార్చుతోందని అన్నారు. గుజరాత్లోని కేవదియాలో బుధవారం సీవీసీ, సీబీఐ సంయుక్త సమావేశంలో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. అవినీతిని కట్టడి చేయడంలో గత ప్రభుత్వం విఫలమైందన్నారు.
తమ ప్రభుత్వం అవినీతిని దీటుగా ఎదుర్కొని దళారుల ప్రమేయం లేకుండా ప్రభుత్వ పధకాలు అందుతాయనే విశ్వాసాన్ని ప్రజల్లో నెలకొల్పిందని చెప్పారు. దేశ ప్రజలను మోసగించిన వ్యక్తులను ఎక్కడ ఉన్నా విడిచిపెట్టేది లేదని ఆర్ధిక నేరగాళ్లు నీరవ్ మోదీ, విజయ్ మాల్యా, మెహుల్ చోక్సీ వంటి వారిని ఉద్దేశించి స్పష్టం చేశారు. జాతి ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించే వారు ఎంతటివారైనా కఠిన చర్యలు తప్పవని అన్నారు.