న్యూఢిల్లీ: కరోనా పరిస్థితిపై ఇవాళ ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఎనిమిది మంది ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైన ప్రధాని నరేంద్రమోదీ.. ఈ నెల 16న మరో ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ నెల 16న ఉదయం 11 గంటలకు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొననున్నారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి కార్యాలయం మీడియాకు వెల్లడించింది.
కరోనా మహమ్మారి శరవేగంగా ఉత్పరివర్తనం చెందుతున్న నేపథ్యంలో.. కరోనా ఉత్పరివర్తనాలపై కఠిన పర్యవేక్షణ ఉండాలని, అన్ని రకాల వేరియంట్లను సునిశితంగా పరిశీలించాలని ఈ సమావేశంలో ముఖ్యమంత్రులకు ప్రధాని సూచించనున్నారు. కరోనా వేరియంట్లు, వాటి ప్రభావంపై నిపుణులు అధ్యయనం చేస్తున్న విషయాన్ని వారికి వివరించనున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా కట్టడికి నివారణ, చికిత్స కీలకమని, అందరూ తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని ప్రధాని సూచించనున్నట్లు పీఎంవో తెలిపింది.