న్యూఢిల్లీ: క్షేత్రస్థాయిలో అసాధారణ పనులు చేస్తున్న వ్యక్తులను పద్మ అవార్డుల కోసం మీరే నామినేట్ చేయండి అంటూ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇండియాలో ఇలా క్షేత్రస్థాయిలో అద్భుతమైన పనులు చేస్తున్న నైపుణ్యం ఉన్న వ్యక్తులు ఎంతోమంది ఉన్నా.. సాధారణంగా వాళ్లు ఎవరికీ తెలియకుండా ఉండిపోతారని ట్విటర్లో మోదీ అన్నారు. సమాజంలో ఇలాంటి ఎంతో మంది వ్యక్తులను మనం చూడము, వారి గురించి వినము. అలాంటి వ్యక్తుల గురించి మీకు తెలుసా? వాళ్లను మీరు పీపుల్స్ పద్మ కోసం నామినేట్ చేయండి.
నామినేషన్లు సెప్టెంబర్ 15 వరకూ తెరిచే ఉంటాయి. http://padmaawards.gov.in లోకి వెళ్లి మీరు ఆ వ్యక్తులను నామినేట్ చేయవచ్చు అని మోదీ చెప్పారు. దేశంలో అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న తర్వాత పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ నిలుస్తాయి. మోదీ ప్రభుత్వం కొన్నేళ్లుగా ఇలా క్షేత్రస్థాయిలో సేవలు చేస్తూ బయటి ప్రపంచానికి పెద్దగా తెలియని ఎంతో మంది వ్యక్తులకు పద్మ అవార్డులు ప్రకటిస్తోంది.