న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కొవిడ్ కేసులు నమోదువుతున్నాయి. చైనా, అమెరికా, దక్షిణకొరియా, బ్రెజిల్ సహా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే అప్రమత్తమైన కేంద్రం రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. రద్దీ ప్రాంతాల్లో జనం మాస్క్లు ధరించాలని, బూస్టర్ డోస్ టీకా తీసుకోవాలని కోరారు. తాజాగా ఇవాళ కొవిడ్పై ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా దేశంలో కొవిడ్ పరిస్థితులు, కొవిడ్ టీకాల, వైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతాధికారులతో సమీక్షించనున్నారు. మరో వైపు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆయా రాష్ట్రాల్లో కొవిడ్ సమీక్షించనున్నారు. ఇదిలా ఉండగా.. ఇవాళ దేశంలో కొత్తగా 185 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,46,76,515కి చేరింది. ప్రస్తుతం 3,402 యాక్టివ్ కేసులున్నాయని ఆరోగ్యశాఖ వివరించింది.