PM Modi : ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆగష్టు 29 నుంచి సెప్టెంబర్ 1 వరకు ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్లలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కిర్గిస్తాన్లో జరిగే ఎస్సీవో 2026 సదస్సుకు హాజరవుతారు. సెంట్రల్ ఆసియా దేశాలైన ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్లతో ద్వైపాక్షిక, వ్యాపార, వాణిజ్య బంధాలను బలోపేతం చేసేందుకు ఈ పర్యటన ఉపయోగపడనుంది. ఎస్సీవో సదస్సు సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో మోదీ భేటీ అవుతారు.
ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షావ్కత్ మిర్జియోయెవ్ ఆహ్వానం మేరకు మోదీ ఉజ్బెకిస్తాన్ వెళ్తున్నారు. ఆగష్టు 29, 30 తేదీల్లో ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్లో పర్యటిస్తారు. అక్కడ ఆ దేశ అధ్యక్షుడితో చర్చలు జరుపుతారు. పెట్టుబడులు, రక్షణ, డిజిటల్ కనెక్టివిటీ, ఎనర్జీ, ఎడ్యుకేషన్ వంటి అంశాలపై చర్చలు జరుపుతారు. అనంతరం రెండు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదుర్చుకుంటారు. అలాగే, తాష్కెంట్లో ఉన్న శాస్త్రి మెమోరియల్, మహాత్మా గాంధీ సెంటర్లను కూడా మోదీ సందర్శిస్తారు.
ప్రధాని హోదాలో మోదీ ఉజ్బెకిస్తాన్ వెళ్లడం ఇది నాలుగోసారి. రెండు దేశాలు సంబంధాలు మరింత బలోపేతం చేసుకుంటున్నాయని భారత విదేశీ మంత్రిత్వ శాఖ తెలిపింది. మోదీ ఉజ్బెకిస్తాన్ పర్యటన అనంతరం అక్కడినుంచి బయల్దేరి కిర్గిస్తాన్ వెళ్తారు. ఆగష్టు 31, సెప్టెంబర్ 1న ఆ దేశ రాజధాని బిష్కెక్లో పర్యటిస్తారు. అక్కడే ఎస్సీవో సదస్సు జరగనుంది. అలాగే, అక్కడ కిర్గిస్తాన్ అధ్యక్షుడు సడైర్ ఝాపారోవ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు.