సిద్దిపేట: రేపటి తరానికి ఆరోగ్యవంతమైన సమాజాన్ని ఆస్తిగా అందిద్దామని మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేటను చెత్త రహిత పట్టణంగా మార్చడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని చెప్పారు. పట్టణ ప్రగతిలో భాగంగా సిద్దిపేటలోని స్వచ్ఛబడిని మంత్రి ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా చెత్తతో తయారైన సేంద్రియ ఎరువులను, సేంద్రియ పద్ధతిలో సాగుచేసిన కూరగాయలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. చెత్తను ఆదాయ వనరుగా మారుస్తామన్నారు. చెత్త ద్వారా గ్యాస్ తయారు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని, త్వరలోనే సిద్దిపేట పట్టణంలో చెత్త ద్వారా గ్యాస్ తయారుచేసే కార్యక్రమాన్ని చేపడతామన్నారు. చెత్త నుంచి సంపద సృష్టిపై అవగాహన కోసమే స్వచ్ఛబడిని ఏర్పాటు చేశామన్నారు. పసి పిల్లల నుంచి పండు ముసలి వరకూ చెత్త గురించి సిద్దిపేట స్వచ్ఛబడి పాఠాలు నేర్పుతుందని చెప్పారు.