గాన కోకిల లతా మంగేష్కర్ అంత్యక్రియలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతున్నారు. ఆదివారం సాయంత్రం 6ః15 నిమిషాలకు ముంబైలోని శివాజీ పార్కులో లతా మంగేష్కర్ అంత్యక్రియలు జరుగుతాయి. సాయంత్రం కల్లా ప్రధాని మోదీ ముంబై చేరుకుంటారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ‘లతా మంగేష్కర్కు నివాళులు అర్పించేందుకు మరి కాసేపట్లో ముంబైకి వెళ్తున్నా.’ అని మోదీ ట్వీట్ చేశారు.
భారత సంస్కృతికి ప్రతినిధిలా స్మరించుకుంటారు : మోదీ
లతా మంగేష్కర్ లేని లోటు పూడ్చలేనిదని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఆమె తన స్వరంతో ప్రజల్ని మంత్రముగ్ధుల్ని చేశారని, ఆమె వెళ్లిపోయారన్న వార్త విని, చెప్పలేనంత ఆవేదన చెందుతున్నానని అన్నారు. రాబోయే తరాలు ఆమెను భారత సంస్కృతికి ప్రతినిధిగా స్మరించుకుంటూనే వుంటారన్నారు. అలాగే భారత చలన చిత్ర రంగంలో వచ్చిన అనేక మార్పులకు ఆమె సాక్షిగా నిలిచారని, ఆమె పాడిన పాటలు అనేక రకాల వ్యక్తీకరణలను బయటికి తీసుకొచ్చాయని కొనియాడారు. భారత దేశ వృద్ధిని నిరంతరం కాంక్షిస్తూ వుండేవారని, అభివృద్ధితో వున్న బలమైన భారతాన్ని చూడాలని ఆమె కాంక్షించారని మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు.
గాన కోకిల లతా మంగేష్కర్ ఆదివారం కన్నుమూశారు. జనవరి 8 న ఆమె కరోనా బారినపడ్డారు. గత 29 రోజులుగా ఆమె ముంబైలోని బ్రీచ్కాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కొన్ని రోజుల క్రితం ఆరోగ్యం కాస్త మెరుగైందని వార్తలొచ్చాయి. అంతలోనే ఆరోగ్యం విషమించి, తుది శ్వాస విడిచారు. పలు అవయవాల వైఫల్యం వల్ల లతా మంగేష్కర్ తుది శ్వాస విడిచారని ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి.