న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం సాయంత్రం 5 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ప్రధాన మంత్రి కార్యాలయం ట్విటర్లో ఈ విషయాన్ని వెల్లడించింది. కొవిడ్ పరిస్థితులపైనే ఆయన మాట్లాడే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో కొవిడ్ రెండో దశ తగ్గుముఖం పట్టినట్లే కనిపిస్తోంది. కేసులు రెండు నెలల కనిష్ఠానికి పడిపోయాయి.
మరోవైపు తమ ప్రభుత్వ వ్యాక్సినేషన్ పాలసీపై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో మోదీ దానిపై కూడా మాట్లాడతారని సమాచారం. సుప్రీంకోర్టు కూడా వ్యాక్సిన్ పాలసీపై ప్రభుత్వాన్ని ఏకిపారేసింది. దాని కోసం బడ్జెట్లో కేటాయించిన 35 వేల కోట్లు ఏమయ్యాయని కూడా ప్రశ్నించింది. వీటిపై ప్రధాని తన ప్రసంగంలో వివరణ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.