న్యూఢిల్లీ, జూన్ 16: ప్రపంచం దాత-గ్రహీత విధానం నుండి సంఘీభావం, సమానత్వంపై ఆధారపడిన భాగస్వామ్యాల వైపు మరలాలని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం జీ7 నాయకులకు పిలుపునిచ్చారు. నూతన భాగస్వామ్యాలను ఏర్పరుచుకోవడం, అంతర్జాతీయ సంఘీభావాన్ని పునర్నిర్మించడం అనే అంశంపై ఎవియన్-లె-బైన్స్లో జరిగిన అవగాహన సదస్సులో మోదీ మాట్లాడుతూ అంతర్జాతీయ భాగస్వామ్యాలను నిర్మించడంలో పరస్పరం అనుసంధానమవుతున్న ప్రపంచంలో విశ్వాసం ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పక్కన కూర్చున్న మోదీ ప్రసంగిస్తూ అంతర్జాతీయ భాగస్వామ్యం పట్ల భారతదేశానికి ఉన్న దృక్పథం వసుధైక కుటుంబం అనే శాశ్వతమైన తత్వంలో ఇమిడి ఉందని కూడా ఆయన నొక్కి చెప్పారు. ఈ సమావేశానికి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, బ్రెజిల్ అధ్యక్షుడు లూలూ డా సిల్వా, యురోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తదితరులు హాజరయ్యారు. స్లోవేకియాలో తన రెండు రోజుల పర్యటనను ముగించుకున్న తర్వాత మోదీ జీ7 సమావేశాలకు వేదికైన ఎవియన్-లె-బైన్స్కు చేరుకున్నారు.
ద్వైపాక్షిక సంబంధాలలో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య 16 నెలల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముఖాముఖి కలుసుకోవడం ఇదే మొదటిసారి. మంగళవారం జరిగిన జీ7 నాయకుల సమావేశంలో వారు కరచాలనం చేసుకుని క్లుప్తంగా మాట్లాడుకున్నారు. కాగా బుధవారం మోదీ, ట్రంప్ మధ్య పూర్తి స్థాయి ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి.