భారత్- నేపాల్ మధ్య సంబంధాలు చిగురిస్తున్నాయని, ఈ చిగురిస్తున్న సంబంధాలు మానవాళికి ఎంతో ఉపయోగకరంగా వుంటాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. ఈ సంబంధాలు ప్రయోజనకారిగా వుంటాయని అభిప్రాయపడ్డారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ సోమవారం నేపాల్ బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా లుంబినీలో జరిగిన బుద్ధ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడారు. బుద్ధ భగవానుడు జన్మించిన స్థలం ఓ అనుభూతిని కలిగిస్తోందన్నారు. 2014 లో తాను నాటిన మహాబోధి చెట్టు ఇప్పుడు పెద్ద వృక్షంగా మారిపోయిందని పేర్కొన్నారు. ప్రేమ, సంస్కృతి, ఇరు దేశాల మధ్య అనాదిగా ఉన్నాయని గుర్తు చేశారు.
ఇవన్నీ ఇరు దేశాల మధ్య ఎంత బలపడితే.. బుద్ధ సందేశాన్ని అంత వేగంగా ప్రపంచ వ్యాప్తం చేసినవారమవుతామని అన్నారు. సారానాథ్, బోధ్గయ, ఇండియాలోని ఖుషీనగర్… ఇవన్నీ ఇరు దేశాల మధ్య సహజమైన వారసత్వ సంపద అని అన్నారు. ఇకపై ఇరు దేశాలు కలిసి… వీటిని మరింత విస్తరించాలని మోదీ ఆకాంక్షించారు.
బుద్ధుడి బోధనలు ఆలోచనలని, అలాగే ఓ సంస్కారాన్ని కూడా కలిగిస్తాయన్నారు. బుద్ధుడు కేవలం బోధనలు చేసి ఊరుకోలేదని, అవి అనుభూతిలోకి వచ్చేలా తగిన జ్ఞానాన్ని కూడా ఇచ్చారని పేర్కొన్నాడు. బుద్ధుడి జీవితమంతా త్యాగభూతమైనదేనని మోదీ అన్నారు.