హైదరాబాద్: ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ ఇటీవల 99వ పుట్టిన రోజు జరుపుకున్న విషయం తెలిసిందే. ఆమె శతవసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా మోదీ తన బ్లాగ్లో కొన్ని విషయాలు రాసుకొచ్చారు. తనకు చిన్నతనంలో అబ్బాస్ అనే ఫ్రెండ్ ఉండేవాడని చెప్పుకొచ్చారు. తన తండ్రికు పక్క ఊర్లో ఓ ఫ్రెండ్ ఉండేవాడని, అయితే అతని మరణంతో ఆ ఫ్రెండ్ కుమారుడు అబ్బాస్ను తమ ఇంటికి తీసుకువచ్చాడని, తనతో పాటే ఉంటూ ఆ పిల్లవాడు స్టడీస్ పూర్తి చేశాడని, ఈద్ పండగ వేళ తన తల్లి ఆ అబ్బాయికి ప్రేమతో వంటలు చేసేదని మోదీ గుర్తు చేశారు. అయితే ఆ అంశాన్ని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ప్రశ్నించారు. ఒకవేళ మీ మిత్రుడు అబ్బాస్ ఉండి ఉంటే.. ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు సరైనవో కావో అడిగి తెలుసుకోవాలన్నారు.
మోదీ తన ఫ్రెండ్ అబ్బాస్ను ఎనిమిదేళ్ల తర్వాత గుర్తు చేసుకున్నాడని, అసలు మోదీకి ఇలాంటి ఫ్రెండ్ ఉన్నట్లు ఎవరికీ తెలియదని, ఒకవేళ అతను ఉండి ఉంటే.. ఇస్లామిక్ మతపెద్దలతో పాటు తాను కూడా మాట్లాడే ప్రసంగాలను విని వాటిపై వివరణ ఇచ్చేలా మోదీ చర్యలు తీసుకోవాలని అసద్ కోరారు. తామేమైనా అబద్దాలు చెబుతున్నామా మీ ఫ్రెండ్ అబ్బాస్ ద్వారా తెలుసుకోవాలన్నారు. అబ్బాస్ అడ్రస్ ఇస్తే తామే అతని వద్దకు వెళ్తామని అసద్ అన్నారు. ప్రవక్తపై నుపుర్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమా కాదా అన్న విషయాన్ని అతన్ని అడిగి తెలుసుకుంటామన్నారు. నుపుర్ అనుచితంగా మాట్లాడినట్లు అతను అంగీకరిస్తాడని అసద్ అన్నారు.