పుణె, ఆగస్టు 1: విపక్ష ఇండియా కూటమి విజ్ఞప్తిని బేఖాతరు చేస్తూ ప్రధాని మోదీతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మంగళవారం వేదిక పంచుకున్నారు. పుణెలో ప్రధాని మోదీకి లోక్మాన్య తిలక్ పురస్కారం అందించిన సభలో శరద్ పవార్ మాట్లాడారు. శివాజీ ఎప్పుడూ ఇతరుల రాజ్యాన్ని కాజేయలేదంటూ.. పరోక్షంగా శివసేన, ఎన్సీపీలో బీజేపీ చీలికలు తెచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. మోదీతో పవార్ వేదిక పంచుకోవడం విపక్ష కూటమికి మంచి సంకేతం కాదని ఆ కూటమి సభ్యులు ఆక్షేపించిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని శివసేన (యూబీటీ) కూడా సామ్నా పత్రికలో విమర్శించింది. ఎన్సీపీని అవినీతి పార్టీగా అభివర్ణించిన మోదీతోనే పవార్ వేదిక పంచుకోవడం తగదని తెలిపింది. అదే వేదికపై తనపై వచ్చిన సందేహాలకు పవార్ సమాధానం ఇచ్చి ఉండాల్సిందని వ్యాఖ్యానించింది. మోదీ పుణె పర్యటనకు వ్యతిరేకంగా ఎన్సీపీ కార్యకర్తలు ధర్నా చేసిన విషయాన్ని గుర్తు చేసింది.