వారణాసి : కాశీ ముఖచిత్రాన్ని ప్రభుత్వం మార్చివేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కాశీ ప్రతిష్ట, శక్తి నలుదిశలా విస్తరిస్తోందని అన్నారు. ప్రధాని మోదీ మంగళవారం సద్గురు సదఫల్దేవ్ విహంగమ్ యోగ్ సంస్ధాన్ 98వ వార్షిక వేడుకల్లో పాల్గొని సద్గురు సదఫల్దేవ్కు నివాళులు అర్పించారు. అనంతరం మెగా వారణాసి ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు.
విశ్వనాధ్ ధామ్ను కాశీ నగరం ఆ మహదేవుడికి అంకితం చేసిందని కాశీ విశ్వనాధ కారిడార్ ప్రారంభోత్సవాన్ని ప్రస్తావిస్తూ పేర్కొన్నారు. ఇక స్వాతంత్ర్య పోరాటంలో సన్యాసుల పాత్రను చరిత్ర ప్రస్తావించలేదని విస్మయం వ్యక్తం చేశారు. భారత స్వాతంత్ర్య సమరంలో సద్గురు సదఫల్దేవ్తో పాటు ఎందరో సన్యాసులు పాల్గొన్నా వారి సేవలను ప్రస్తుతించాల్సిన స్ధాయిలో చరిత్రలో పొందుపరచలేదని అన్నారు.
అంతకుముందు వారణాసిలో తన రెండో రోజు పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ కాశీ విశ్వనాధ్ ఆలయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం బీజేపీ ముఖ్యమంత్రులతో సుపరిపాలనపై ప్రధాని మోదీ సమాలోచనలు సాగించారు.