న్యూఢిల్లీ : కాశీలో జరిగిన అభివృద్ధి దేశంలోని ఇతర నగరాలకు రోడ్మ్యాప్ వంటిదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మన దేశంలో చాలా నగరాలు సంప్రదాయ నగరాలని వాటి అభివృద్ధి కూడా ఇదే తరహాలో చేపట్టాలని అన్నారు. ఆయా నగరాల్లోని స్ధానిక నైపుణ్యాలు, ఉత్పత్తులను గుర్తించి ప్రోత్సహించడం నేర్చుకోవాలని సూచించారు.
వారణాసిలో శుక్రవారం అఖిల భారత మేయర్ల సదస్సును ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సదస్సులో పాల్గొన్న మేయర్లు తమ నగరాల అభివృద్ధి కోసం ఏ చిన్న అవకాశాన్నీ జారవిడుచుకోరనే విశ్వాసం తనకున్నదని అన్నారు. తమ నగరాలను పరిశుభ్ర నగరాల జాబితాలో ముందుండేలా మేయర్లు కృషిచేయాలని కోరారు. మనం మన చారిత్రక వారసత్వ కట్టడాలకు పునరుత్తేజం కల్పించాలని అన్నారు.
మేయర్ల సదస్సులో ప్రారంభోపన్యాసం చేసిన యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్ కాశీ అభివృద్ధిని ప్రస్తుతించారు. గత ఏడేండ్లుగా అభివృద్ధిలో కాశీ కొత్తపుంతలు తొక్కుతోందని చెప్పుకొచ్చారు. కాశీ ప్రాచీన సంస్కృతిని కాపాడుతూనే పురాతన నగరాన్ని కొత్త రూపంలో ప్రపంచం ముందు ఆవిష్కరించామని యోగి ఆదిత్యానాధ్ పేర్కొన్నారు.