న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్లోని అన్ని పార్టీల నేతలతో మూడు గంటలకుపైగా సాగిన ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం ముగిసింది. పునర్విభజన, రాష్ట్ర హోదా, ఎన్నికల అంశాలు చర్చకు వచ్చినట్లు నేతలు చెప్పారు. సమావేశం సందర్భంగా జమ్ముకశ్మీర్కు మళ్లీ రాష్ట్ర హోదా ఇవ్వడానికి తాను కట్టుబడి ఉన్నట్లు ప్రధాని మోదీ హామీ ఇచ్చారని జమ్ముకశ్మీర్ అప్నీ పార్టీ చీఫ్ మహ్మద్ బుఖారీ వెల్లడించారు. ఈ సమావేశం మూడు గంటలకుపైగా సాగిందంటేనే ఇది విజయవంతమైందనడానికి నిదర్శనమని బీజేపీ నేత రామ్మాధవ్ ట్వీట్ చేశారు.
రాష్ట్ర హోదా ఇవ్వడానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు మోదీ చెప్పారని కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ చెప్పారు. అన్ని పార్టీల నేతలు సమావేశంలో రాష్ట్ర హోదా కోసం పట్టుబట్టినట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర హోదా డిమాండ్తోపాటు ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి వెంటనే అసెంబ్లీ ఎన్నికలు పెట్టాలని, కశ్మీరీ పండిట్లకు జమ్ముకశ్మీర్లో పునరావాసం, అన్ని పార్టీల నేతలను నిర్బంధం నుంచి విడుదల చేయాలని మోదీని అడిగినట్లు ఆజాద్ వెల్లడించారు.
సమావేశం చాలా స్నేహపూర్వక వాతావరణంలో జరిగిందని, జమ్ముకశ్మీర్ ప్రజలకు న్యాయం జరుగుతుందన్న సానుకూల దృక్ఫథంతో తాము బయటకు వచ్చినట్లు పీపుల్స్ కాన్ఫరెన్స్ నేత సజ్జద్ లోన్ చెప్పారు.