న్యూఢిల్లీ: అయోధ్యలో రామ్లల్లా ప్రాణప్రతిష్ట అంశంపై ఇవాళ లోక్సభలో స్వల్ప కాలిక చర్చ జరిగింది. ఆ చర్చలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడారు. విష్ణు సంప్రదాయం ప్రకారమే ప్రధాని మోదీ .. అయోధ్య రామ ప్రతిష్టలో పాల్గొన్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రాణప్రతిష్ట వేడుక కోసం ప్రధాని మోదీ 11 రోజుల ఉపవాసం పాటించినట్లు చెప్పారు. ఆ సమయంలో ఆయన కేవలం కొబ్బరి నీళ్లు మాత్రమే తీసుకున్నట్లు వెల్లడించారు. విభిన్న భాషల్లో ఆయన రామభజన చేశారని, ఆ సమయంలో దేశవ్యాప్తంగా భక్తి ఉద్యమాన్ని నడిపించారని, కానీ ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని రాజకీయం చేయలేదని అమిత్ షా తెలిపారు. రామ జన్మభూమి ఉద్యమ సమయంలో జైశ్రీరామ్ అని నినాదాలు చేశామని, ఇప్పుడు ఆలయాన్ని పూర్తిగా నిర్మించామని, అందుకే ఇప్పుడు జై సియా రామ్ అనాలన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోనే ఈ భక్తి యాత్ర సాగిందన్నారు.
ఆగస్టు 5వ తేదీన అయోధ్యపై తీర్పు వచ్చిన తర్వాత దేశంలో అల్లర్లు జరుగుతాయని చాలా మంది టెన్షన్కు గురయ్యారని, ఆలయం నిర్మాణ సమయంలోనూ ఇలాగే ఆలోచించారని, కానీ మోదీ సర్కార్ చాలా శాంతియుతంగా ఆ కార్యక్రమాలను నిర్వహించినట్లు చెప్పారు. సుప్రీంకోర్టు ఆగస్టు 5వ తేదీన ఇచ్చిన తీర్పును మనం గౌరవించాలన్నారు. అయోధ్యలో మందిర నిర్మాణం కోసం హిందూ సమాజం చాన్నాళ్లు పోరాడిందన్నారు.
కేవలం రామమందిరాన్నే కాదు.. రామ సేతను కూడా ప్రధాని మోదీ నిర్మించారన్నారు. సుమారు 330 ఏళ్ల న్యాయపోరాటం తర్వాత రామ్లల్లా చివరకు తన నివాస స్థానానికి చేరినట్లు షా పేర్కొన్నారు. ప్రతి మతం, ప్రతి భాషలో రామాయణం ఉందన్నారు. షేక్ సదుల్లా మాష్కు చెందిన రామయన్ యే మాషి కూడా ఉందన్నారు. రాముడు లేదా రామచరిత్ర లేకుండా ఈ దేశాన్ని ఊహించలేమని షా అన్నారు. జనవరి 22వ తేదీ భవిష్యత్తు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు.