రాష్ట్రంలో విద్యుత్తుతో పాటు ఆర్థిక సంక్షోభం
ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల చెల్లింపు ఆలస్యం
శాలరీ పెంచాల్సి వస్తుందని సర్వీస్ గ్రేడ్ల నిలిపివేత
మోదీ సీఎంగా ఉన్నప్పటి నుంచి ఇదే పరిస్థితి
15 ఏండ్లుగా గుజరాత్ ఉద్యోగుల ఇబ్బందులు
అప్రెంటిస్షిప్ ఐదేండ్లు.. జీతం రూ.11వేలు
అహ్మదాబాద్, ఏప్రిల్ 13: విద్యుత్తు సంక్షోభం. పవర్ హాలీడేలు. నాలుగు లక్షల కోట్ల దాకా అప్పులు. ఉద్యోగులకు జీతాలు చెల్లించలేనంతగా దిగజారిపోయిన ఆర్థిక వ్యవస్థ.. బీజేపీ ఎంతో గొప్పగా చెప్పే ‘డబుల్ ఇంజిన్ ప్రభుత్వం’ ఉన్న గుజరాత్ రాష్ట్ర ప్రస్తుత పరిస్థితి ఇది. గుజరాత్లో ప్రభుత్వ ఉద్యోగులకు ఆరు నెలలుగా జీతాలను సరిగ్గా చెల్లించడం లేదు. ప్రతీ నెల 5వ తేదీలోపు పడాల్సిన జీతం నెలాఖరుకైనా రావడం లేదు. కొన్ని విభాగాల్లో అయితే రెండుమూడు నెలల తర్వాత చెల్లించిన సందర్భాలున్నాయి. ముఖ్యంగా విద్య, ఆరోగ్య రంగాల్లో పనిచేస్తున్నవారికైతే ఐదారు నెలలుగా జీతాలు ఎప్పుడు పడతాయో తెలియని పరిస్థితి. నిధుల కొరత వల్లే ఇలా జరుగుతున్నదని అధికారులే చెప్తున్నారు. ఈ ఆర్థిక సంక్షోభంతో గుజరాత్లోని 4 లక్షల మందికి పైగా ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ, గ్రాంట్-ఇన్-ఎయిడ్ కాలేజీల బోధన, బోధనేతర సిబ్బందికి సకాలంలో జీతాలు చెల్లించకపోవడంపై గుజరాత్ రాష్ట్ర అధ్యాపక మహామండల్ ఆందోళన వ్యక్తం చేసిం ది. గురువారం గుజరాత్లోని అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులు ధర్నా చేయాలని నిర్ణయించారు.
హైకోర్టు మొట్టికాయలు వేసినా..
గుజరాత్లో ప్రభుత్వ ఉద్యోగుల సమస్య ఇటీవల మొదలైంది కాదు. 10-15 ఏండ్లుగా ఉన్నది. ‘గుజరాత్ రాష్ట్రం దేశానికే రోల్ మోడల్’ అంటూ 2014లో అప్పటి సీఎం, ప్రస్తుత ప్రధాని మోదీ గొప్పగా ప్రచారం చేసిన సందర్భంలోనూ గుజరాత్లో ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర సమస్యల్లో ఉన్నారు. జీతాలు పెంచాల్సి వస్తుందని గుజరాత్లోని అప్పటి మోదీ ప్రభుత్వం ఉద్యోగుల సర్వీసు గ్రేడ్లను నిలిపివేసింది. వాస్తవానికి ఉద్యోగి సర్వీసులో చేరిన 9, 20, 31 ఏండ్లకు సర్వీసు గ్రేడ్లను పెంచాలి. కానీ, 15 ఏండ్లుగా గుజరాత్లో ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ గ్రేడ్లను పెంచలేదు. కనీసం ఒక్క సర్వీసు గ్రేడ్ కూడా పెరగకుండానే పదవీ విరమణ చేసిన ఉద్యోగులు ఉన్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. సర్వీస్ గ్రేడ్లపై ప్రభుత్వ ఉద్యోగులు హైకోర్టును కూడా ఆశ్రయించారు. కోర్టు పలుమార్లు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. అయినప్పటికీ బీజేపీ సర్కారు తీరు మారలేదు.
అప్రెంటిస్షిప్ జీతాలకూ పోరాటమే
ప్రభుత్వ ఉద్యోగం వస్తే అప్రెంటిస్షిప్(శిక్షణా కాలం) ఏడాది, రెండేండ్లు ఉంటుంది. కానీ, గుజరాత్లో అప్రెంటిస్షిప్ కాల పరిమితి ఐదేండ్లు. మరే రాష్ట్రంలోనూ ఇంత సమయం లేదు. శిక్షణా కాలం ఎక్కువగా ఉన్నా.. జీతమైనా సరిగ్గా ఇస్తారా అంటే అదీ లేదు. అప్రెంటిస్షిప్లో ఉన్న ఉద్యోగికి ఇచ్చేది కేవలం రూ.2,500 మాత్రమే. ఉద్యోగులు ఎన్నో ఏండ్లు పోరాటం చేయడంతో ఇటీవలే దీన్ని రూ.11వేలు చేశారు. అంటే ప్రభుత్వ ఉద్యోగం సాధించిన వ్యక్తి ఐదేండ్ల పాటు నెలకు రూ.11 వేల జీతానికే పనిచేయాలన్నమాట. శిక్షణా కాలంలో ఉద్యోగికి మెడికల్ బెనిఫిట్స్, బీమా ఉండవు.